ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పీకల్లోతు: చిదంబరంపై ఛార్జిషీట్: ఆయన కుమారుడితో సహా 13 మంది!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి పీ చిదంబరం పీకల్లోతు వరకు చిక్కుకుపోయారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 310 కోట్ల రూపాయల నిధులను అక్రమంగా మళ్లించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న చిదంబరంపై సీబీఐ అధికారులు ఛార్జిషీట్ నమోదు చేశారు. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జీ సహా డజను మందిపై ఛార్జిషీట్ ను తయారు చేశారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.
చిదంబరంపై ఛార్జిషీట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఈ రెండు కేసుల్లో అటు సీబీఐ, ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఇదివరకు ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినప్పటికీ.. దీనిపై ఈడీ అధికారులు న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 21వ తేదీన చిదంబరం అరెస్టు అయ్యారు. అప్పటి నుంచీ సీబీఐ, ఈడీ అధికారుల కస్టడీలో కొనసాగుతున్నారు.
మొదట్లో సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. కిందటి నెల 5వ తేదీన ఆయనను తీహార్ జైలుకు తరలించారు. అక్కడే విచారణ కొనసాగిస్తున్నారు. బెయిల్ కోసం చిదంబరం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఆయన తరఫున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ.. ఆయనకు బెయిల్ లభించలేదు. సరికదా- ప్రతిసారీ కస్టడీని పొడిగిస్తూ వచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరంపై ఛార్జిషీట్ నమోదు కావడం కూడా ఇదే తొలిసారి.
కార్తి చిదంబరంతో పాటు పీటర్ ముఖర్జీ, కార్తి చిదంబరం సన్నిహితుడు భాస్కర్, కేంద్రమాజీ కార్యదర్శి ఆర్ ప్రసాద్, విదేశీ వ్యవహారాల మాజీ డైరెక్టర్ ప్రబోధ్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనూప్ పుజారి, అదనపు కార్యదర్శి సిద్ధుశ్రీ కుల్హర్, ఐఎన్ఎక్స్ మీడియా, కార్తి చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, ఛెస్ నిర్వహణ యాజమాన్యం పేర్లను కూడా ఛార్జిషీట్ లో నమోదు చేశారు సీబీఐ అధికారులు. వారిని త్వరలోనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఛార్జిషీట్ నమోదుతో ఈ కేసు తీవ్రత మరింత పెరిగినట్లు చెబుతున్నారు.