జాడ తెలిసింది: నీరవ్ మోడీ యూకేలోనే, భారత్ రప్పించేందుకు సీబీఐ యత్నాలు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 13వేల కోట్ల కుంభకోణం చేసి దేశం విడిచిపారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యూనైటెడ్ కింగ్డమ్(యూకే-బ్రిటన్)లో ఉన్నట్లు తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే అధికారులు కూడా ధృవీకరించారు. ఈ క్రమంలో అతన్ని తిరిగి భారత్కు పంపించాలని కోరుతూ సీబీఐ అధికారులు యూకేను కోరారు.
నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ ఛోక్సీలు పీఎన్బీలో రూ.13వేల కోట్ల మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కుంభకోణం బయటపడటానికి కొద్ది రోజుల ముందే ఈ ఏడాది జనవరిలో వీరు దేశం విడిచి పారిపోయారు.
అప్పటి నుంచి వారిని భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2002 నుంచి భారత ప్రభుత్వం 29మంది పారిపోయిన నేరగాళ్లను స్వదేశానికి పంపించాల్సిందిగా యూకేను కోరింది.
అయితే, నీరవ్ మోడీ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ, తాజాగా, యూకే అధికారులే ధృవీకరించడంతో నీరవ్ మోడీ యూకేలోనే ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరిలో నీరవ్, ఛోక్సీల పాస్ పోర్టులను భారత్ రద్దు చేసింది. అయినప్పటికీ ఇతర దేశాల పాస్పోర్టులతో నీరవ్ మోడీ వివిధ దేశాలకు వెళుతున్నారు.