లంచం తీసుకున్నారన్న కేసులో సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానాకు క్లీన్ చిట్
లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో మరో డీఎస్పీ దేవేంద్రకుమార్తో పాటు మరికొందరికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఆదేశాల మేరకు రాకేష్ అస్తానాపై చార్జ్షీట్ దాఖలు చేసింది విచారణ సంస్థ. అప్పట్లో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా డైరెక్టర్ అలోక్ వర్మల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
రాకేష్ అస్తానాకు క్లీన్ చిట్
చార్జిషీటును సీబీఐ కోర్టుకు సమర్పించగా జస్టిస్ సంజీవ్ కుమార్ కేసును విచారణ చేశారు. అయితే చార్జ్షీట్లో దాఖలు చేసినట్లుగా మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ ఈ కేసులో నిందితుడిగా గుర్తించినట్లు చెప్పిన సీబీఐ... అతని సోదరుడు సోమేష్ ప్రసాద్ మరియు సునీల్ మిట్టల్లపై ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉందని న్యాయమూర్తి దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ గోయెల్పై ఎలాంటి చార్జిషీటు దాఖలు కాలేదు. ప్రసాద్ సోదరులకు ఈయన సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు విచారణాధికారులు ఎక్కడా పేర్కొనలేదు.
Recommended Video
పలు కోణాల్లో విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కాకుండా ఇతరుల్లో ఒక వ్యక్తిపై చార్జ్షీట్ దాఖలు చేశారని, మరికొందరిపై విచారణ కొనసాగుతుందని విచారణాధికారులు చెప్పారు. విదేశాలకు పంపిన లేఖలను విచారణాధికారులు పరిశీలిస్తున్నారు. కేసులో అవే కీలకం కానున్నట్లు చెప్పారు. రాకేష్ అస్తానాకు కేసుల నుంచి విముక్తి కల్పించే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వెలువడ్డాయి. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రిపోర్టును కూడా తయారు చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ప్రసాద్ సోదరులపై మాత్రం విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. రాకేష్ అస్తానాను పలు కోణాల్లో విచారణ చేసిన తర్వాత తను ఎలాంటి లంచం తీసుకోలేదనే నిర్థారణకు సీబీఐ వచ్చినట్లు సమాచారం. ఇక ఈ చార్జ్షీటును బుధవారం జడ్జి పరిశీలిస్తారు.
గడువు కోరడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు
కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లాను ఫిబ్రవరి 12వ తేదీన హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన క్రమంలో సీబీఐ చార్జ్షీట్ సబ్మిట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ పూర్తి చేసేందుకు ఎంత సమయం కావాలో అనేదానిపై సీబీఐ తరపున లాయర్ స్పష్టత ఇవ్వకపోవడంతో సీబీఐ డైరెక్టరే హాజరుకావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. గతేడాది మే 31న కేసును విచారణ చేసేందుకు నాలుగు నెలల సమయం గడవు ఇచ్చింది కోర్టు. అక్టోబర్ 9, 2019న మరో రెండు నెలల సమయం ఇచ్చింది. అదే సమయంలో ఇకపై విచారణ పూర్తి చేసేందుకు గడువు ఇవ్వబోమని కోర్టు స్పష్టం చేసింది.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి
ఈ క్రమంలోనే అస్తానా, కుమార్, ప్రసాద్లు తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.జనవరి 2019లో వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తూ వీరిపై విచారణను 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మోయిన్ ఖురేషీ కేసులో అప్పటి సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా ఉన్న అస్తానా రూ.2.9 కోట్లు లంచం తీసుకున్నారని అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మ ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 15, 2018లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రసాద్ సోదరుల కేసును నీరుగార్చేందుకు రాకేష్ అస్తానా లంచం తీసుకున్నారని అలోక్ వర్మ ఆరోపించారు. ఈ కేసులో సతీష్ సానాను సాక్షిగా సీబీఐ తీసుకుంది.