బొగ్గు స్కాం: సంబంధం లేదని దాసరి, రాజకీయాలకూ..
న్యూఢిల్లీ: హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు సిబిఐకి వెల్లడించినట్లు సమాచారం. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు.
స్క్రీనింగ్ కమిటీ తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్కు తలబిరా-2 బొగ్గు బ్లాకుల్ని కేటాయించిందని, తాను అదే నిర్ణయాన్ని సమర్థించానని దాసరి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీలో వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారని, వారి నిర్ణయమే అంతిమమన్నారు.
బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం లేదని, నలభై మందితో కూడిన కమిటీ ఓకే చేశాకనే తాను ఫైల్స్ పైన సంతకం చేశానని, సిబిఐ విచారణ నేపథ్యంలో తాను గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తాను నిరపరాధిగా తేలుతానని దాసరి చెప్పారు.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన దాసరి.. బొగ్గు కుంభకోణం కేసు నుంచి నిర్ధోషిగా బయటపడతానని అన్నారు. సహాయమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఫైల్ను ప్రధాని వద్దకు తీసుకువెళ్లే వాడిననని, ఎవరికి ఎంత కోటా కేటాయించాలో ఆయనే నిర్ణయించే వారన్నారు.
విజయ్ దర్దాకు క్లీన్ చిట్
రెండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ కాంగ్రెస్ ఎంపి విజయ్ దర్దాకు, ఆయన యాజమాన్యంలోని యావత్మల్ ఎనర్జీ లిమిటెడ్కు కేసు నుంచి విముక్తి కల్పించింది. చత్తీస్గడ్లోని ఫతేపూర్ ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్దాపై కేసు మూసివేస్తున్నట్టు నివేదిక ఇచ్చింది. అలాగే జెఎల్డి యావత్మల్, జెఎఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లపై కూడా కేసు మూసివేసింది.