డీకే రవి, డీసీ కార్యాలయం సిబ్బందికి సీబీఐ నోటీసులు
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు కోలారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల నుండి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. విచారణకు హాజరు కావాలని ఉద్యోగులు, సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.
ఇటీవల సీబీఐ అధికారులు కోలారు చేరుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం బెంగళూరు చేరుకున్న సీబీఐ అధికారులు.. మరిన్ని వివరాలు సేకరించాలని విచారణ చేస్తున్నామని మీరు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
డీకే రవి 2013 ఆగస్టు 10 నుండి 2014 అక్టోబర్ 29వ తేది వరకు కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ సందర్బంలో రవితో కలిసి పని చేసిన అక్కడి అధికారులు, సిబ్బంది నుండి పూర్తి వివరాలు సేకరించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.
జూన్ 8 నుండి జూన్ 10వ తేది లోపు బెంగళూరులోని కార్యాలయంలో హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులలో సూచించారు. మొత్తం 8 మందికి నోటీసులు జారీ అయ్యాయి. అందులో ఇద్దరు జిల్లా కలెక్టర్ పర్సనల్ సెక్రటరీలు (పీఏ), ఇద్దరు కారు డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్, గన్ మ్యాన్, అటెండర్ తదితరులు ఉన్నారు.
కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న డీకే రవిని రాష్ట్ర ప్రభుత్వం 2014 మార్చి 16వ తేదిన బెంగళూరులోని వాణిజ్య పన్నుల విభాగం అధికారిగా బదిలి చేసింది. తర్వాత డీకే రవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.