పీఎన్బీ కుంభకోణంలో ట్విస్ట్: ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ చైర్మన్లకు నోటీసులు..
న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు టాప్ బ్యాంకర్స్ చైర్మన్లకు సమన్లు జారీ చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ చందా కొచ్చర్తో పాటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మకు తాజాగా సమన్లు జారీ అయ్యాయి. కుంభకోణంలో ఇప్పటివరకు 16మందిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video
కుంభకోణంలో పలు బ్యాంకు అధికారుల ప్రమేయం ఉన్నట్టు తేలడంతో.. ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకే కొచ్చర్, శిఖా శర్మలకు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసుకు సంబంధించి సోమవారం మరో నలుగురిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.
పీఎన్బీ స్కామ్: ఆ 3ఖాతాలను నిలిపేసిన ఎస్బిఐ, నీరవ్ కంపెనీల నుంచి ఛోక్సీకి రూ.4500కోట్లు!
ముంబై విమానశ్రయంలో అరెస్ట్
స్కామ్లో మరో నిందితుడు మెహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ను సీబీఐ ముంబై విమానశ్రయంలో అదుపులోకి తీసుకుంది. కుంభకోణానికి సంబంధించి అతన్ని ప్రశ్నించనుంది.
అదుపులో నలుగురు
కేసులో అరెస్టయిన నలుగురు నిందితులను సోమవారం రిమాండ్కు తరలించారు. 12రోజుల పాటు వారు రిమాండ్లో ఉండనున్నారు. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు నీరవ్ మోడీ సంస్థకు చెందినవారు కాగా మరో ఇద్దరు గీతాంజలి గ్రూప్ ఆడిటర్, ఉద్యోగి.
అక్రమ ఎల్ఓయూలలో వీరి పాత్ర:
అక్రమ ఎల్ఓయూలు రూపొందించి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావడంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ కె. బోసమియా(అప్పట్లో ఏజీఎం), మితెన్ అనిల్ పాండ్యా(అప్పట్లో ఫైనాన్స్ మేనేజర్)లను సీబీఐ అరెస్ట్ చేసింది.
మరో ఇద్దరు ఆడిటర్, ఉద్యోగి:
ఇక మూడో వ్యక్తి సంజయ్ రాంబియా ఒక చార్టెడ్ అకౌంట్. ముంబైలోని సంపత్&మెహతా కంపెనీకి చెందిన సంజయ్.. నీరవ్ మోడీ కంపెనీలకు ఇంటర్నేషనల్ ఆడిటర్గా ఉన్నారు. ఇక అరెస్టయిన వారిలో నాలుగో వ్యక్తి అనియత్ శివ్ రమన్ నాయర్ గిల్లీ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు.
నీరవ్ మోడీ స్కామ్
కాగా, విదేశాల్లో డబ్బా కంపెనీలను సృష్టించి అక్రమ ఎల్ఓయూల ద్వారా డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు పొందారు. దాదాపు రూ.11వేల కోట్ల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారు. బ్యాంకు సిబ్బంది సహాయంతోనే నీరవ్ మోదీ ఈ అక్రమాలకు పాల్పడినట్లు బ్యాంకు చెబుతోంది.