బొగ్గు స్కాం: సిఎం నవీన్ పట్నాయక్ను ప్రశ్నించే ఛాన్స్
న్యూఢిల్లీ: సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ కేసులో నవీన్ పట్నాయక్ పేరునూ చేర్చే అవకాశం కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఆయనను కూడా ప్రశ్నించాలని సిబిఐ భావిస్తోంది.
బొగ్గు కుంభకోణం వివాదానికి మూలకారణమైన హిందాల్కోకు బొగ్గు గనులు కేటాయించాలంటూ నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా సిఫారసు చేశారు. ఈ కుంభకోణంలో నవీన్ పాత్రపై సిబిఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
"హిండాల్కో బిడ్ను 2005లో స్క్రీనింగ్ కమిటీ తోసిపుచ్చింది. అయినప్పటికీ, హిండాల్కో సంస్థకు తాలాబిరా-2 గని కేటాయించాలంటూ నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు'' అని సిబిఐ వర్గాలు తెలిపాయి. హిండాల్కో దరఖాస్తును తిరస్కరించి, ప్రభుత్వ రంగ సంస్థలకు (పిఎస్యూ) గనులు ఇవ్వాలన్న పిసి పరేఖ్ను కూడా నవీన్ అప్పట్లో తప్పుపట్టారు.
"బొగ్గు గనుల శాఖ కార్యదర్శిగా మీరు మొత్తం పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం పిఎస్యూల గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదు'' అని పరేఖ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ను కూడా ప్రశ్నించి వివరాలు తెలుసుకోవాలని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ రాష్ట్రంలో హిండాల్కోకు బొగ్గు గని కేటాయించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయడాన్ని నవీన్ పట్నాయక్ సమర్థించుకున్నారు. ఆ లేఖ ప్రతిని కూడా గురువారం ఆయన విడుదల చేశారు. "ఒడిసా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రానికి లేఖ రాశాను. హిండాల్కో అభ్యర్థనను పరిశీలించాలని కోరాను. గనుల కేటాయింపులో అంతిమ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. అందుకే ప్రధానికి లేఖ రాశాను'' అని తెలిపారు.
కాగా, 'నేను దోషినయితే ప్రధాని కూడా దోషే. ఆయననూ సిబిఐ ప్రశ్నించాలి. అప్పటి బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావును కూడా కేసులో చేర్చాల'ని ఆ శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ స్పందించారు. ప్రధాని నిజాయతీకి ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.