ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు: చిదంబరం, కార్తీలను నిందితులుగా పేర్కొన్న సీబీఐ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు భారీ షాక్ తగిలింది. వీరిద్దరి పేర్లను ఎయిర్సెల్ మాక్సిక్ మనీలాండరింగ్ కేసులో నిందితులుగా చేర్చింది సీబీఐ. చిదంబరం, కార్తీతోపాటు 9మంది ప్రభుత్వ, ఎయిర్సెల్ మాక్సిస్ అధికారుల పేర్లను తీసుకోనుంది.
గురువారం పటియాలా హౌజ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను సీబీఐ దాఖలు చేసింది. నెల రోజుల కిందటే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జీ షీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ ఛార్జీషీటులో పేర్కొంది. నిబంధనలను మార్చి ఎయిర్సెల్లో గ్లోబల్ కమ్యూనికేషణ్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టేలా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ ఇచ్చారని సీబీఐ తెలిపింది.
కాగా, ఈ కేసులో చిదంబరాన్ని నిందితుడిగా పేర్కొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీటులో చిదంబరం పేరును పలుమార్లు ప్రస్తావించినా.. ఎక్కడా ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు.