సుప్రీంకోర్టుకు ఏకే బస్సీ : రాకేష్ ఆస్తానా కేసును విచారణ చేస్తున్న అధికారి బదిలీ
సీబీఐ వ్యవహారం రోజు రోజుకు రోడ్డున పడుతోంది. ఇప్పటికే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా వ్యవహారంతో సీబీఐ పరువు బజారుకెక్కడంతో వారిద్దరినీ కేంద్రం సెలవుపై పంపింది. ఓ కేసుకు సంబంధించి విచారణాధికారిగా ఉన్న రాకేష్ అస్తానా లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయనపై విచారణకు ఆదేశించింది సీబీఐ. ఈ కేసును ఏకే బస్సీ విచారణ చేస్తున్నారు. అయితే బస్సీని పోర్ట్ బ్లెయిర్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులపై బస్సీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఆస్తానా కేసుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని బస్సీ తెలిపారు. అంతేకాదు ఆస్తానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ను ఏర్పాటు చేయాలని బస్సీ కోరారు. అయితే వెంటనే పిటిషన్ను విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొద్ది రోజుల సమయంలోనే పిటిషన్ను విచారణకు స్వీకరిస్తామని వెల్లడించింది. అక్టోబర్ 24న పోర్ట్ బ్లెయిర్ ఆఫీసుకు బదిలీ చేస్తూ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం మాత్రం నాగేశ్వరరావు ఎలాంటి ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు వీలు లేదని పేర్కొంది.
ఇక అలోక్ వర్మ ముడుపులు తీసుకున్నారని రాకేష్ అస్తానా ఆరోపణలు గుప్పించారు. ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారకముందే కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరినీ సెలవుపై పంపింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రెండువారాల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. విచారణను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీని నియమించింది.