డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ అధికారుల మెరుపు దాడి: ఇప్పటికే తీహార్ జైలులో.. మరిన్ని కేసులు?
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనపై మరిన్ని కేసులను తాజాగా నమోదు చేయవచ్చని తెలుస్తోంది. దేశ రాజధానిలోని సఫ్దర్ జంగ్ మార్గ్ లో ఉన్న డీకే శివకుమార్ నివాసంపై సీబీఐ అధికారులు సోమవారం మెరుపుదాడి చేశారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్టయ్యారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ అధికారులు డీకే శివకుమార్ నివాసంపై దాడి చేయడం ఆయన వర్గీయులను మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.
నాడు చాలెంజ్ చేసిన డీకే నేడు తీహార్ జైల్లో, మాజీ సీఎం, సొంత సోదరుడు ఎంట్రీ!
సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ ఇంటిపై మెరుపుదాడి..
ఢిల్లీ సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ లో బీ-4/17 నంబర్ గల నివాసం డీకే శివకుమార్ కు చెందినది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు హఠాత్తుగా దాడి చేశారు. సుమారు ఎనిమిది మంది అధికారులు సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ నివాసంపై దాడి చేశారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. తమ కస్టడీలో ఉన్న డీకే శివకుమార్ ఇచ్చిన సమాచారం మేరకే సీబీఐ అధికారులు ఈ దాడి చేపట్టినట్లు తెలుస్తోంది. వారు దేనికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారనేది ఇంకా తెలియ రాలేదు. ఈ ఇళ్లు డీకే శివకుమార్ పేరు మీదే రిజిస్టరై ఉన్నట్లు సమాచారం.
ఆందోళనలో కాంగ్రెస్..
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో కర్ణాటక కాంగ్రెస్, డీకే శివకుమార్ అనుచరుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. డీకే చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోందనే అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తోన్న వారు డీకే శివకుమార్ కు బెయిల్ ఇప్పించడానికి చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. డీకేకు బెయిల్ తీసుకునిరావడానికి చట్టపరంగా ఏయే చర్యలు చేపట్టాలో అన్నీ చేశారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ నేతల ప్రయాత్నాలేవీ ఫలించలేదు. ఆయన చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటూనే వస్తోంది.
మానసికంగా దృఢంగా..
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న డీకే శివకుమార్ ను ఈ ఉదయం జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి- బెయిల్ లభించే విషయంపై కుమారస్వామి ఆయనకు వివరించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ.. తాను లొంగబోయేది లేదని, తాను ఎలాంటి తప్పూ చేయనప్పుడు ఎందుకు తల వంచాలని డీకే శివకుమార్ తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. మానసికంగా డీకే చాలా దృఢంగా ఉన్నారని అన్నారు.