హత్రాస్ గ్యాంగ్ రేప్ : నిందితుడి ఇంట్లో 'నెత్తుటి మరకల దుస్తులు'... స్వాధీనం చేసుకున్న సీబీఐ...
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు గురువారం(అక్టోబర్ 15) నిందితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిందితుల్లో ఒకరైన లవ్ కుష్ సికర్వర్ ఇంట్లో నెత్తుటి మరకలతో కూడిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి నెత్తుటి మరకలు కాదని,పెయింట్ మరకలని నిందితుడి కుటుంబం వెల్లడించింది. దీనిపై సీబీఐ నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక స్పందన లేదు.
న్యాయం జరిగేంతవరకూ చితాభస్మాన్ని నిమజ్జనం చేసేది లేదు... తేల్చి చెప్పిన హత్రాస్ బాధితురాలి తండ్రి
అవి నెత్తుటి మరకలు కాదు.. : నిందితుడి కుటుంబం
సీబీఐ తనిఖీల అనంతరం నిందితుడి సోదరుడు లలిత్ సికర్వర్ ఓ వీడియో మెసేజ్ ద్వారా దీనిపై మాట్లాడారు. అధికారులు తమ ఇంట్లో రెండున్నర గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో వారికి ఎరుపు రంగు మరకలతో కూడిన దుస్తులు దొరికాయని చెప్పారు. అవి రక్తపు మరకలు కాదని సీబీఐ అధికారులు గుర్తించారని... అయినప్పటికీ ఆ దుస్తులను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారన్నారు. తమ పెద్దన్న రవి సికర్వర్ ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడని... ఆ దుస్తులు అతనివేనని చెప్పారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో దుస్తులకు ఆ ఎరుపు మరకలు అంటుకున్నాయని తెలిపారు.
బూల్గర్హిలో 4 రోజులు సీబీఐ..
హత్రాస్ దళిత యువతిపై గ్యాంగ్ రేప్కి పాల్పడిన నలుగురు నిందితుల ఇళ్లల్లో సీబీఐ టీమ్ గురువారం తనిఖీలు నిర్వహించింది. గత నాలుగు రోజులుగా బూల్గర్హి గ్రామంలోనే ఉన్న సీబీఐ అధికారులు బాధితురాలి తండ్రి,సోదరులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి సోదరుల్లో ఒకరిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలోని నలుగురి నిందితుల కుటుంబాలను కూడా సీబీఐ అధికారులు విచారించారు.
ముగిసిన సిట్ విచారణ
మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం... ఈ కేసులో విచారణ ముగిసినట్లు తెలిపింది. సిట్ టీమ్ శుక్రవారం(అక్టోబర్ 16) విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30న సిట్ దర్యాప్తు మొదలవగా... ప్రభుత్వం వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే ఆ తర్వాత మరో 10 రోజుల పాటు గడువును పొడగించింది. తాజాగా సిట్ విచారణ ముగియడంతో... దర్యాప్తులో ఏం తేలిందన్నది ఉత్కంఠ రేపుతోంది.
Recommended Video
ఘటన జరిగిందిలా...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో సెప్టెంబర్ 14న స్థానిక దళిత(వాల్మీకి) యువతిపై నలుగురు ఉన్నత కులాలకు చెందిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం జరపడమే కాకుండా ఆమె నాలుక కూడా కోసేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఆఖరికి మెరుగైన వైద్యం కూడా ఆలస్యంగా అందడంతో.. ఘటన జరిగిన రెండు వారాలకు బాధితురాలు కన్నుమూసింది. అదే రోజు రాత్రి అధికారులు హడావుడిగా కనీసం బాధితురాలి తల్లిదండ్రులను కూడా అనుమతించకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది.