హాస్పిటల్ నుంచి లాలూ రాజకీయం బెయిల్ ఇవ్వొదని సుప్రీంలో సీబీఐ అఫిడవిట్
ఢిల్లీ : దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలుచేసింది. లూలూ కోర్టును మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే అనారోగ్యం పేరుతో బెయిల్ అర్జీ పెట్టుకున్నారని సీబీఐ అధికారులు కోర్టుకు విన్నవించారు.
దాణా కుంభకోణంలో 27.5 ఏళ్ల శిక్ష పడ్డ లాలూను అనారోగ్యం కారణంగా ప్ర్తుతం రాంచీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శిక్ష పడిన నాటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆయన కోసం హాస్పిటల్ పేయింగ్ రూంలో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లుచేశారు. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్ లో చేరిన లాలూ అక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారని సీబీఐ ఆరోపిస్తోంది.
ఇదే విషయాన్ని అఫిడవిట్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ విజయం కోసం హాస్పిటల్ నుంచే వ్యూహాలు రచిస్తున్న ఆయన అనారోగ్యం పేరుతో కోర్టును మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అఫిడవిట్లో స్పష్టం చేసింది. అందుకే లాలూకు బెయిల్ ఇవ్వవద్దని కోరింది.
లాలూ హాస్పిటల్ నుంచి రాజకీయాలు నడుపుతున్నారన్న ఆరోపణలకు సాక్ష్యంగా రాంచీ హాస్పిటల్లోని స్పెషాలిటీ వార్డులో ఆయనను కలిసేందుకు వచ్చిన రాజకీయ నాయకుల లిస్టును సీబీఐ కోర్టుకు సమర్పించింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. సీబీఐ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం కేసును బుధవారానికి వాయిదా వేసింది.