ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయండి.. ఉన్నావ్ కేసులో సీబీఐకి సుప్రీం ఆదేశం
ఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తు జరుగుతున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తర్ప్రదేశ్లో బాధితురాలికి న్యాయం జరగదని పరోక్ష సంకేతాలిచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితురాలిని యూపీ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసే అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి పరిహారం ఇచ్చే విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
7రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశం
ఉన్నావ్ బాధితురాలి లేఖను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. సీబీఐ అధికారుల వివరణ కోరిన న్యాయస్థానం విచారణ పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. కనీసం నెల రోజుల సమయం పడుతుందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా.. న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేసు విచారణకు నేతృత్వం వహిస్తున్న అధికారి ఆదివారం నాటికి ప్రమాదానికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
యూపీ నుంచి ఢిల్లీకి బాధితురాలి తరలింపు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలి ఆరోగ్యం గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దీంతో జడ్జి ఆమెను కదిలించే స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ ఆమెను యూపీనుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించే అవకాశం ఉందేమో పరిశీలించాలని చెప్పారు. బాధితురాలితో పాటు గాయపడ్డ ఆమె లాయర్ను మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.
బాధితురాలికి రూ.25లక్షల పరిహారం
ఉన్నావ్ బాధితురాలు, ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన అవససరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాధిత కుటుంబానికి రూ. 25లక్షల పరిహారం చెల్లించాలంటూ యోగి సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వారి భద్రతకు సంబంధించి సుప్రీం కీలక సూచనలు చేసింది. బాధితురాలు, ఆమె లాయర్, తల్లి, నలుగురు తోబుట్టువులు, మేనమామతో పాటు గ్రామంలో ఉన్న ఆమె సమీపబంధువులందరికీ రక్షణ కల్పించాలని ఆదేశించింది. మరోవైపు యూపీలో కొనసాగుతున్న నాలుగు కేసుల విచారణను ఢిల్లీకి బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మధ్యాహ్నం వాదనలు విని నిర్ణయంతీసుకుంటామని ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్నావ్ బాధితురాలితో పాటు ఆమె లాయర్కు లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. వారి పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరూ వెంటిలేటర్పైనే ఉన్నారని హాస్పిటల్ వర్గాలు చెప్పారు.