పీఎన్బీ స్కాం: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ మెడకు చుట్టుకొంది.పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. స్కాం చోటు చేసుకొన్న కాలం నుండి అధికారులపై సీబీఐ దృష్టిపెట్టింది.
ఈ కేసు విషయమై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ను శుక్రవారం ప్రశ్నించింది. దాదాపు రూ.13,500 కోట్ల మేర పీఎన్బీ భారీ కుంభకోణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్బీఐ సరియైన ఆడిట్ చేపట్టలేకపోవడమేనని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఆరోపించిన నేపథ్యంలో సీబీఐ మరింత చురుకుగా కదులుతోంది.
ఈ నేపథ్యంలో తాజా చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ అధికారి పేరు మాత్రం వెల్లడి కాలేదు. పీఎన్బీ స్కాం విషయంలో తొలిసారి ఆర్బీఐ అధికారులను కూడా ఇప్పటికే విచారించింది సీబీఐ . ఆర్బీఐకు చెందిన నలుగురు సీనియర్ ఆర్బీఐ అధికారులను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.
నలుగురు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ల్లో ముగ్గురు చీఫ్ జనరల్ మేనేజర్లు, ఒకరు జనరల్ మేనేజర్ ఉన్నారు. మోదీ, చౌక్సిలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్(ఎల్ఓయూ) జారీచేసిన విషయం సెంట్రల్ బ్యాంకుకు తెలుసా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఎల్ఓయూ జారీ ప్రక్రియలో ఆడిటింగ్పై కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న 80:20 గోల్డ్ ఇంపోర్ట్ స్కీమ్పై కూడా సీబీఐ విచారిస్తోంది. ఈ స్కీమ్ చౌక్సి, మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే.