కుంభకోణం కాదు, పారిపోలేదు: రోటామాక్ ఓనర్ విక్రమ్ అరెస్ట్, ప్రశ్నిస్తున్న సీబీఐ, సోదాలు
ముంబై: ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రోటామాక్ అధినేత విక్రమ్ కొఠారీ అధినేత విక్రమ్ కొఠారీని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కొఠారీ.. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల నుంచి రూ. 800 కోట్లకు పైగా రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.
పీఎన్బీలో కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ మాదిరిగానే కొఠారీ కూడా విదేశాలకు పారిపోయారని దాదాపు అన్ని దినపత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ఓ ప్రకటన వెలువరిస్తూ.. తాను కాన్పూర్ లోనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని ప్రకటించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొఠారీని సీబీఐ ప్రశ్నిస్తోంది. అలాగే ఆయన ఆస్తులపై దాడులు నిర్వహిస్తోంది.
నేనెం కుంభకోణం చేయలేదు.. పారిపోలేదు
అంతకుముందు కొఠారీ చేసిన తన ప్రకటనలో ‘ముందుగా చెప్పేది ఏంటంటే, ఇది కుంభకోణం కాదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. నేను భారత పౌరుడినే. నా ఊరిలోనే ఉన్నాను. నా కంపెనీలను నిరర్ధక ఆస్తిగా బ్యాంకులు ప్రకటించాయి. నేనేమీ బ్యాంకులకు డబ్బులను ఎగ్గొట్టిన వ్యక్తిని కాదు. ఈ మొత్తం వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో విచారణ దశలో ఉంది. బ్యాంకుల అధికారులతో నేను నిత్యమూ మాట్లాడుతూనే ఉన్నాను. వారికి సహకరిస్తున్నాను. తీసుకున్న రుణాలను త్వరలోనే చెల్లిస్తా' అని స్పష్టం చేశారు.
లిఖ్తే లిఖ్తే లవ్ హో జాయే: ఎవరీ విక్రమ్ కోఠారీ?
సీబీఐ విస్తృత సోదాలు
కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. కాన్పూర్లోని కొఠారీ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. కొఠారీకి సంబంధించిన మూడు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా, ఈ కేసు విషయమై కొఠారీ, ఆయన భార్య, కుమారుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కొఠారీని ప్రశ్నిస్తున్న సీబీఐ
బ్యాంక్ ఆఫ్ బరోడా సహా అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విక్రమ్ కొఠారీ రూ. 800కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే వీటికి కొఠారీ అసలు గానీ, వడ్డీ గానీ ఇంతవరకూ చెల్లించలేదని.. అంతేగాక గత కొన్నిరోజులుగా ఆయన కనిపించడంలేదని వార్తలు వచ్చాయి. పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీలాగే ఆయన కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పరారైనట్లు వస్తున్న వార్తలపై విక్రమ్ కొఠారీ స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, కాన్పూర్లోనే ఉన్నట్లు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పాన్ పరాగ్ దీపక్ కొఠారీ సోదరుడే విక్రమ్
కాగా, 1980వ దశకంలో విపరీతంగా మార్కెటింగ్ అయిన ‘పాన్ పరాగ్' బ్రాండ్ సృష్టికర్త దీపక్ కొఠారీ సోదరుడే విక్రమ్ కొఠారీ. వారి కుటుంబం 1990ల్లో విడిపోగా, విక్రమ్ సొంతంగా రొటొమాక్ పేరిట స్టేషనరీ వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే మంచి పేరు, గర్తింపు పొందారు.