చిదంబరం, కార్తీ ఇళ్లలో సీబీఐ సోదాలు.. 16 చోట్ల తనిఖీలు, 'నా గొంతు వినిపించకుండా'
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం, ఆయన తనయుడు కార్తీ నివాసాల్లో సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సోదాలు నిర్వహిస్తోంది.
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం, ఆయన తనయుడు కార్తీ నివాసాల్లో సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సోదాలు నిర్వహిస్తోంది.
చిదంబరం కుటుంబానికి చెందిన పదహారు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతులు ఇప్పించిన కేసులో.. దర్యాప్తులో భాగంగా సీబీఐ ఈ సోదాలు చేస్తున్నారు.
చెన్నై, ఢిల్లి, నోయిడా తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కేవలం తమిళనాడులోనే పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
కాగా, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన తనయుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఐటీశాఖ పలుసార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేపట్టింది.
ఈ కేసులో చిదంబరం పాత్రపై నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు ఇటీవల ఐటీ శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో చిదంబరంపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నేడు సీబీఐ సోదాలు చేపట్టింది.
2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతించారని బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
మరోవైపు ఈ కుంభకోణంలో చిదంబరం తనయుడు కార్తీ ఓ విదేశీ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరిపైనా సీబీఐ దృష్టి పెట్టింది. కాగా, సీబీఐ సోదాలపై చిదంబరం మాట్లాడారు. తన వాయిస్ వినిపించకుండా చేసేందుకే ఈ సోదాలు అని ఆరోపించారు.