శశికళ దెబ్బ: చెన్నైలో 40 చోట్ల సీబీఐ సోదాలు, మంత్రి, డీజీపీ, మాజీ డీజీపీలకు షాక్ !
చెన్నై: తమిళనాడు మంత్రి, ఐపీఎస్ లకు సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీ బుధవారం చెన్నై నగరంతో పాటు తమిళనాడులో ఏకకాలంలో 40 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తోంది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సీ. విజయ్ భాస్కర్ కు మరోసారి అధికారులు షాక్ ఇచ్చారు. మంత్రి విజయ్ భాస్కర్, తమిళనాడు డీజీపీ టీకే. రాజేంద్రన్, ఆ రాష్ట్ర మాజీ డీజీపీ జార్జ్ ఇళ్లతో పాటు 40 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తోంది.
అక్రమాస్తులు, మంత్రి మీద చర్యలు తీసుకోండి, సీఎంకు ఐటీ శాఖ లేఖ, వీకే శశికళ!
చెన్నైలోని పోయెస్ గార్డెలలోని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేదనిలయంలో ఆమె నెచ్చలి వీకే. శశికళ గదిలో ఐటీ శాఖ అధికారులకు చిక్కిన డైరీలోని వివరాల ఆధారంగా సీబీఐ అధికారులు నేడు సోదాలు ముమ్మరం చేశారు. సీబీఐ సోదాలతో గుట్కా స్కాంతో సంబంధాలు ఉన్న వారు హడలిపోతున్నారు.
మంత్రికి ఐటీ శాఖ దెబ్బ
అక్రమాస్తులు, గత సంవత్సరం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు తమిళనాడు మంత్రి సీ. విజయ్ భాస్కర్ ఇంటిలో సోదాలు చేసి భారీ మొత్తంలో నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు రోజుల్లో షాక్
తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు విషయంపై విచారణ చేసిన ఐటీ శాఖ అధికారులు అవి అక్రమ ఆస్తులు అని గుర్తించి ఆయన మీద చర్యలు తీసుకోవాలని నాలుగు రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐటీ శాఖ లేఖ రాసిన నాలుగు రోజులకే సీబీఐ అధికారులు మంత్రి విజయ్ భాస్కర్ కు మరో షాక్ ఇచ్చారు.
గుట్కా స్కాంలో పెద్దలు ?
తమిళనాడులో జయలలిత మరణించిన తరువాత 2017 జులై 8వ తేదీన గుట్కా స్కాం వెలుగు చూసింది. ఆ సందర్బంలో ఐటీ శాఖ అధికారులు తమిళనాడులో గుట్కా, పాన్ మసాలు తయారు చేస్తున్న కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు, వాటి యజమానులు, బంధువులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా దాడులు చేశారు.
రూ. 250 కోట్ల స్కాం
ఆదాయపన్ను శాఖ అధికారులకు మస్కా కొట్టి గుట్కా, పాన్ మసాల తయారు చేసి విక్రయిస్తున్నారని గతంలో వెలుగు చూసింది. ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాల్లో సుమారు రూ. 250 కోట్లకు పైగా పన్ను ఎగవేసి గుట్కా, పాన్ మసాల తయారు చేసి విక్రయించారని వెలుగు చూసింది. గుట్కాను 2013లోనే తమిళనాడు ప్రభుత్వం నిషేదిస్తూ (బ్యాన్) ఆదేశాలు జారీ చేసింది. ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదుతో ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది.
చిన్నమ్మ శశికళ దెబ్బ
గతంలో ఐటీ శాఖ అధికారులు దాడుల్లో పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిలోని శశికళ గదిలో ఓ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో గుట్కా స్కాంలో ఆరోగ్య శాఖ మంత్రి సీ. విజయ్ భాస్కర్ తో పాటు ఏఐఏడీఎంకే పార్టీ నాయకులు, పోలీసు అధికారులకు భారీ మొత్తంలో లంచాలు అందాయని వివరాలు ఉన్నాయని వెలుగు చూసింది. శశికళ గదిలో చిక్కిన డైరీ ఆధారంగా సీబీఐ అధికారులు ఈ రోజు 40 ప్రాంతాల్లో దాడులు చేశారు. గుట్కా స్కాం విషయంపై తమిళనాడు ప్రభుత్వం మీద డీఎంకే పార్టీ అనేక సార్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.