చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు.. ఇంట్లో లేని మాజీ కేంద్ర మంత్రి...
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురు కావడంతో సీబీఐ అధికారులు అలర్టయ్యారు. ఢిల్లీ హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో చిదంబరం సవాల్ చేయగా .. కాసేపటి క్రితం సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు.
ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందని సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిని చిదంబరం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా .. ఇవాళ ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వెంటనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. చిదంబరాన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.
చిదంబరం కోసం అధికారులు వేచి చూశారు. అయితే అక్కడ ఆయన లేరని సమాచారం రావడంతో ఏం చేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంపై .. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పిటిషన్ విచారించాలని చిదంబరం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చిదంబరం పిటిషన్పై ఇవాళే విచారణకు స్వీకరించాలని సిబల్ కోరగా .. సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు బుధవారం ఉదయం విచారిస్తామని స్పష్టంచేసింది.