తెరపైకి కెనరా బ్యాంక్: రూ.515కోట్లు ఎగ్గొట్టిన ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్, ఇక్కడా బలైన పీఎన్బీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత వరుస బ్యాంకు కుంభకోణాలు బయటపడటం ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పీఎన్బీ, సింబోలీ షుగర్స్ కుంభకోణాలు మరువక ముందే తాజాగా మరో మోసం వెలగులోకి వచ్చింది.
కోల్కతాకు చెందిన ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్, దాని డైరెక్టర్లు రూ.515.15 కోట్లకు బ్యాంకులను మోసం చేసినట్లు కేసు నమోదైంది. కంపెనీ డైరెక్టర్లు శివాజీ పంజా, కౌస్తువ్ రే, వినయ్ బఫ్నా, వైస్-ప్రెసిడెంట్ దేబాంత్ పాల్, గుర్తుతెలియని బ్యాంకు అధికారులపై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది.
మోసం కేసులు
సెక్షన్ 120బి రెడ్ విత్ 420 కింద నేరపూరిత కుట్ర, 468, 471 కింద ఫోర్జరీ, ప్రభుత్వ సేవకుడి నేరపూరిత ప్రవర్తల కింద కేసులు నమోదు చేశారు. 2015లో ఇదే కంపెనీపై ఐడీబీఐ బ్యాంకును మోసం చేసినట్లు కేసు నమోదైంది. ప్రస్తుతం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని 10 బ్యాంకుల కన్సార్టియం సీబీఐని ఆశ్రయించింది.
స్కాం ఎలా జరిగింది..
2012లో వివిధ బ్యాంకుల్లో ఆర్పి ఇన్ఫోసిస్టమ్స్ వివిధ బ్యాంకుల్లో లెటర్స్ ఆఫ్ క్రెడిట్ను పొందింది. ఆ తర్వాత ఎల్సి ఆధారంగా నిధులను బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని వాడుకుంది. కానీ, బ్యాంకులకు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు.
అంతా మోసపూరితమే..
బ్యాంకుల నుంచి రుణాలను పొందేందుకు తాము గెయిల్ ఇండియా లిమిటెడ్, విన్సెంట్ ఎలక్ట్రానిక్స్, సియాట్ లిమిటెడ్తో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కానీ, వాస్తవానికి ఆయా కంపెనీలకు ఆర్పి సిస్టమ్స్తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో తప్పుడు వాటాలు, ఆదాయాలు, రుణదాతలను , పత్రాలను, ఫోర్జరీ డ్రాయింగ్ పవర్ లేఖలను చూపించి బ్యాంకులను మోసం చేసినట్లు తేలింది.
మోసం బయటపడిందిలా..
ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్ వ్యవహారం 2015లోనే బయటకు వచ్చింది. ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.180.44 కోట్లు తీసుకొని ఎగ్గొట్టింది. ఈ రుణం కోసం బ్యాంకులోని కొందరు అధికారులను ప్రలోభపెట్టినట్లు తేలింది. దీంతోపాటు తప్పడు పత్రాలను కూడా బ్యాంకులకు అందజేసింది. అప్పట్లో పంజాతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
సీఎంతో కలిసి పర్యటన.. అరెస్ట్
2015లో అత్యంత నాటకీయ పరిస్థితుల్లో శివాజీ పంజాను అరెస్టు చేశారు. ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి అనధికారిక అతిథి హోదాలో ఢాకా పర్యటనకు వెళ్లి వస్తుండగా ఆ రాష్ట్ర పోలీసులే అరెస్టు చేశారు. అప్పటికే ఆయనపై ఢిల్లీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన తర్వాత మమతా అతన్ని దూరం పెట్టారు. కాగా, ఆయనకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉండటం గమనార్హం. అంతేగాక, పంజా ఆ రాష్ట్రానికి చెందిన పలు హైపవర్ కమిటీల్లో పనిచేశారు. ఫిల్మ్ అండ్ కల్చర్, పరిశ్రమల ప్రచారం కమిటీల్లో ఉన్నారు.
పీఎన్బీ కూడా మోసపోయింది..
ఇప్పటికే నీరవ్ మోడీ వ్యవహారంతో అప్రతిష్ఠపాలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పంజా చేతిలో మోసపోయిన పది బ్యాంకుల జాబితాలో ఉంది. ఎస్బీఐ, ఎస్బీబీజే, యూబీఐ, అలహాబాద్ బ్యాంక్, ఓబీసీ, సెంట్రల్ బ్యాంక్, స్టేట్బ్యాంక్ ఆఫ్ పటియాల, ఫెడరల్ బ్యాంకులు బాధిత బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. కొన్ని బిల్లులను ఐఎఫ్సీఐ ఫాక్టర్స్లో పంజా డిస్కౌంట్ చేసుకున్నారు. తర్వాత ఆ బిల్లులను ఐఎఫ్సీఐ ఫాక్టర్స్ వసూలు చేసుకోవటానికి వెళ్లగా సదరు కంపెనీలు తమవి కావని తేల్చాయి. దీంతో ఐఎఫ్సీఐ ఫాక్టర్స్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మోసపూరిత వ్యవహారాలపై దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని కోరిన నేపథ్యంలో కెనరా బ్యాంకు వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.