హత్రాస్ కేసులో మరో ట్విస్ట్- గంటల వ్యవధిలోనే వెబ్సైట్లో ఎఫ్ఐర్ తొలగించిన సీబీఐ...
ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతి గ్యాంగ్ రేప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూపీ సర్కారు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. పోలీసుల దర్యాప్తు చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న వారికి నిరాశ తప్పేలా లేదు. సీబీఐ వ్యవహారశైలే ఇందుకు కారణం.
హత్రాస్ కేసు దర్యాప్తును యూపీ పోలీసుల నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్న సీబీఐ.. పోలీసులు తయారు చేసిన ఎఫ్ఐఆర్ను నిన్న తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. దీంతో పాటు ప్రెస్ రిలీజ్ కూడా ఉంచింది. అయితే గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ కాపీని వెబ్సైట్ నుంచి తొలగించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై అనుమానాలు మరింత పెరిగాయి.
ఈ కేసు దర్యాప్తును సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకోగానే ఘజియాబాద్లోని ఏసీబీ బ్రాంచ్ కార్యాలయంలో కేసు నమోదైంది. ఇందులో హత్రాస్ యువతిపై అత్యాచారం, హత్యాయత్నం, సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ కాపీని సీబీఐ తమ వెబ్సైట్లో పెట్టింది. అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ తొలగించగా.. ప్రెస్ రిలీజ్ క్లిక్ చే్స్తే ఓ బ్యాంకు మోసం కేసు దర్యాప్తు ప్రత్యక్షమవుతోంది.
హత్రాస్ కేసు దర్యాప్తులో యూపీ పోలీసులు ఒత్తిళ్ల ఆధారంగా పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఐ చేతికి వెళ్లినా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకోవడంపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం ద్వారా యూపీలోని యోగీ సర్కారు ఊరట పొందినా ఇప్పుడు సీబీఐ దర్యాప్తుపైనా అందరి కళ్లూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ వెబ్సైట్ నుంచి మాయం కావడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.