రవి కేసు: చెన్నై సిబిఐ దర్యాప్తు, కర్ణాటక ఆఫీసర్లకు నో ప్లేస్
బెంగళూరు: ఐఎఎస్ అధికారి రవి మృతి కేసును చెన్నై సిబిఐ బృందం దర్యాప్తు చేయనుంది. ఈ బృందంలో కర్ణాటకకు చెందిన అధికారులు ఉండడం లేదు. ఈ బృందంలో ముగ్గురు లేదా ఐదుగురు అధికారులు ఉండే అవకాశం ఉంది. సిబిఐలో ప్రస్తుతం ఇద్దరు కర్ణాటక క్యాడర్ అధికారులు ఉన్నారు. వారు ఈ బృందంలో ఉండరని తెలుస్తోంది.
సిబిఐ తొలుత సిఐడి రూపొందించిన నివేదికను పరిశీలించనుంది. ఆ తర్వాత పోస్టుమార్టం నివేదికను పరిశీలించనుంది. రవి పంపిన చివరి మెసేజ్ను కూడా సిబిఐ పరిగణనలోకి తీసుకుంటుంది. వ్యక్తిగత, వృత్తి సంబంధమైన కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తుంది.
కాగా, ఐఏఎస్ అధికారి రవి కేసు దర్యాప్తు మూడు నెలలలో పూర్తి చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. మూడు నెలలలో కేసు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సీబీఐ అధికారులకు సూచించారు.
సోమవారం మద్యాహ్నం ఆయన విదాన సౌధలో మంత్రి వర్గ సమావేశం ఎర్పాటు చేసి సుధీర్ఘంగా చర్చించారు. ఆ సమయంలో మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అధికారులు వారి పని వారు చేసుకుని వెళ్తారని, దర్యాప్తులు మంత్రులు జోక్యం చేసుకోరాదని సిద్దరామయ్య చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పలు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని గుర్తు చేశారు. ఇప్పటికే అనేక కేసుల దర్యాప్తు పెండింగ్ లో ఉన్నాయని, సీబీఐ అధికారులు రవి కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చెయ్యాలని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల విధులను అడ్డుకొలేదని అన్నారు.
అధికారుల విధులలో తాను జోక్యం చేసుకొలేదని స్పష్టం చేశారు. రవి ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారి, కోలారు జిల్లాలో ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారనే విషయం తనకు తెలుసు అన్నారు. రవి పనితీరు బాగుందని గుర్తించి బెంగళూరులోని వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ గా బదిలి చేశామని అన్నారు.
నాలుగు నెలలలో వాణిజ్య పన్నలు శాఖలో రవి పని చేసిన తీరును ఇదే సమయంలో మెచ్చుకున్నారు. అలాంటి సిన్సియర్ ఐఏఎస్ అధికారి ఈ విదంగా మరణించడం చాల బాధకలిగించిందని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ,రాజ్యసభ సభ్యుడు బీ.కే. హరిప్రసాద్ మాట్లాడుతూ - ప్రతిపక్షాలు పట్టుబట్టడం వలన రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించలేదని అన్నారు. రవి తల్లి దండ్రుల కన్నీరు, ఆయన అభిమానులు ఆవేదన చూసి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించామని సమర్థించుకున్నారు.