కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తావా... సీబీఐ నాగేశ్వరరావుకు సుప్రీం చురకలు
బీహార్లో ప్రభుత్వం అధీనంలో నడిచే షెల్టర్ హోమ్స్లో పిల్లలపై అత్యాచారం జరిగిన కేసులో సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచారణ నత్తనడక సాగుతుండటంతో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ మాజీ మధ్యంతర ఛీఫ్గా వ్యవహరించిన నాగేశ్వరరావును వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.
షెల్టర్హోంలో పిల్లలపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ చేపట్టింది. విచారణాధికారిగా ఏకే శర్మ ఉన్నారు. అయితే ఈ కేసును విచారణ చేస్తున్న ఏకే శర్మను, మధ్యంతర సీబీఐ ఛీఫ్గా ఉన్న నాగేశ్వరరావు బదిలీ చేశారు. దీంతో కేసులో పురోగతి స్తంభించింది. మాజీ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాల విషయంలో విబేధాలు తలెత్తడం అది కోర్టుల వరకు వెళ్లిన నేపథ్యంలో మధ్యంతర ఛీఫ్గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు చాలామంది అధికారులను బదిలీ చేశారు. అయితే ఇలాంటి సున్నితమైన కేసును విచారణ చేస్తున్న ఏకే ఖాన్నే తిరిగి నియమించాలని కోర్టు చెబుతూ... అదే సమయంలో ఆయన్ను ఎందుకు బదిలీ చేశారో నాగేశ్వరరావు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది.
నాగేశ్వరరావు భాసురన్లు ఇద్దరూ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. తాము ఇచ్చిన ఆదేశాలతో ఆటలాడుకున్న మిమ్మలను దేవుడే సహాయం చేయాలంటూ రంజన్ గొగోయ్ అన్నారు. ఈ కేసును విచారణ చేస్తున్న త్రిసభ్య ధర్మాసనంలోని జడ్జిగా ఉన్న మదన్ లోకూర్ పదవీవిరమణ పొందడంతో ఆయన స్థానంలోకి ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వచ్చారు. కిందటి సారి జస్టిస్ మదన్ లోకూర్ విచారణ చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జడ్జీలు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు.
కేసును విచారణ చేస్తున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయరాదు అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పటికీ.... బదిలీ ఎలా చేస్తారని ఛీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి బదిలీపై సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్యానెల్లో ఉన్న సభ్యులకు ఈ విషయం తెలుసో లేదో కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలపాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఏకే శర్మతో పాటు మరో ఆరుగురు విచారణాధికారులు బదిలీ అయ్యారు. వీరంతా రాకేష్ అస్తానా కేసును విచారణ చేస్తున్న వారు కావడం విశేషం.