దావూద్ వేట కోసం స్పెషల్ టీమ్స్.. గుట్కా దందాపై పాక్ తో సంప్రదింపులు
న్యూఢిల్లీ : 23ఏళ్లుగా ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న దావూద్ ఇబ్రహీం వేటకు భారత్ మరోసారి సన్నద్దమైంది. ఇందుకోసం 5 ప్రత్యేక టీమ్ లతో కూడిన 50 మంది అధికారుల బృందాన్ని కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇన్ కమ్ టాక్స్, రీసెర్చ్, ఎనాలసిస్ వింగ్, సీబీఐ ఇంటర్ పోల్ వింగ్ ల నుంచి 50మంది అధికారులను ఇందుకోసం ఎంపిక చేసింది.
ముఖ్యంగా చాలా దేశాల్లో విస్తరించిన దావూద్ ఇబ్రహీం అక్రమ గుట్కా బిజినెస్ పై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్ లో హైదరాబాద్ కేంద్రంగా గుట్కా బిజినెస్ మొదలుపెట్టిన దావూద్.. తన తమ్ముడు అనీస్ ఇబ్రహీం సహాయంతో దాన్ని దుబాయ్ కు విస్తరించాడు. దీనికి సంబంధించిన పలు ఆధారాలు సేకరించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పాకిస్తాన్ ను సంప్రదించింది.
ఈ మేరకు పాకిస్తాన్ తో పాటు యూఏఈ, యూకే లకు కూడా జ్యుడిషియల్ అభ్యర్థనలు పంపింది భారత్. దావూద్ కు సంబంధించిన అక్రమ గుట్కా బిజినెస్ ల సమాచారాన్ని తమకు అందించాల్సిందిగా అభ్యర్థనల్లో భారత్ పేర్కొంది. దీనికి సంబంధించి గత నెలలోనే దావూద్ ఇబ్రహీంతో పాటు అతని బావ అబ్దుల్ హమీద్, హెంచ్ మాన్ సలీమ్ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తులపై సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ లు ఈ మూడు దేశాల్లో డీ గ్యాంగ్ కదలికలను కనిపెట్టనున్నాయి.
గోవాకు చెందిన గుట్కా బిజినెస్ జేఎమ్ జోషి, మానిక్ చంద్ గుట్కా బిజినెస్ మెన్ రసిక్ లాల్ ధరివాల్ లు దావూద్ ఇబ్రహీం తమ్ముడికి సహాయ సహకారాలు అందించినట్లుగా ఆరోపణలున్నాయి. వీరిద్దరి సహాయంతోనే పాకిస్తాన్ లోని హైదరాబాద్ కేంద్రంగా దావూద్ గుట్కా బిజినెస్ చేస్తున్నాడనేది ఆ ఆరోపణల సారాంశం.
ముస్తఫా కబీరా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో దీనిపై విచారణ చేపట్టారు ముంబై పోలీసులు. అందులో తేలిందేంటంటే.. 2002లో 2.16లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకేజింగ్ మిషన్ ను రాజేష్ పచారియా అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి కరాచీలోని దావూద్ సోదరుడు అనీస్ కు పంపించినట్లుగా తేలింది. ఇదే కేసుకు సంబంధించి జోషి, మానిక్ చంద్ గుట్కా బిజినెస్ మెన్ ధరివాల్ లకు కూడా ఇందులో ప్రమేయమున్నట్లుగా పోలీసులు నిర్దారించారు. అనంతరం కేసును సీబీఐకి అప్పగించారు.
జోషికి ధరివాల్ కు మధ్య తలెత్తిన వ్యాపార గొడవల్లో ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సీబీఐ చెబుతున్న దాని ప్రకారం ఈ అక్రమ బిజినెస్ లో ధరివాల్ 20 శాతం వాటా ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో.. జోషికి ధరివాల్ కు మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం.
క్షీణిస్తోన్న దావూద్ ఆరోగ్యం :
ప్రస్తుతం పాక్ లోని కరాచీలో నివాసముంటున్న దావూద్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించిన దావూద్.. ఆరు బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజ్ కార్లను దుబాయ్ నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. షేక్ ఇస్మాయిల్ అనే మారుపేరుతో దావూద్ ప్రస్తుతం తన వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
సెక్యూరిటీ కారణాల రీత్యా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేశాడు దావూద్. ప్రస్తుతం దావూద్ ఫోన్ కాల్స్ అన్నీ దావూద్ భార్యనే లిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం.