నారద కేసు: ముగ్గురు టీఎంసీ ఎంపీల విచారణకు స్పీకర్ అనుమతి కోరిన సీబీఐ
న్యూఢిల్లీ/కోల్కతా: నారద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు టీఎంసీ ఎంపీలు సౌగత రాయ్, కకోలి ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, మాజీ ఎంపీ సువెందు అధికారిలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కోరింది.
స్పీకర్ అనుమతిస్తూ సదరు ఎంపీలపై ఛార్జీషీటు నమోదు చేస్తామని సీబీఐ పేర్కొంది. సువెందు అధికారి ఎంపీగా ఉన్న సమయంలోనే నేరం జరిగినందు వల్ల ఆయనపై అభియోగాలకు కూడా స్పీకర్ అనుమతి కోరామని తెలిపింది.
నారదా కేసులో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఒక వ్యక్తి నుంచి కొందరు టీఎంసీ నాయకులు డబ్బులు తీసుకుంటున్నట్లు టేప్లలో పట్టుబడటంతో సీబీఐ వారిని విచారించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే, విరాళం రూపకంగానే తాము ఆ డబ్బును తీసుకున్నామని సదరు నాయకులు చెప్పుకుంటుండటం గమనార్హం. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్నారు.
2014లో స్టింగ్ ఆపరేషన్లో ఈ నారద స్కాం వెలుగుచూసింది. నారదన్యూస్.కామ్ వెబ్ పోర్టల్ ను 2016 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభించారు. కాగా, 2017, ఏప్రిల్లో సీబీఐ కేసు నమోదు చేసింది. సీనియర్ టీఎంసీ నేతలు, పశ్చిమబెంగాల్ మంత్రులపై క్రిమినల్, అవినీతి అభియోగాలను సీబీఐ నమోదు చేసింది.
మాజీ రాజ్యసభ ఎంపీ ముకుల్ రాయ్(ఇప్పుడు బీజేపీలో ఉన్నారు), లోక్సభ ఎంపీలు సౌగత రాయ్, అపరూప పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, కకోలి ఘోస్ దస్తిదార్, దివంగత ఎంపీ సుల్తాన్ అహ్మద్, పశ్చిమబెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీం, సువెందు అధికారి, సుబ్రత ముఖర్జీ, మాజీ మంత్రి మదన్ మిత్ర, మాజీ కోల్కతా మేయర్ సోవన్ ఛటర్జీ(ఇటీవల బీజేపీలో చేరారు), ఎమ్మెల్యే ఇక్బాల్ అహ్మద్, ఐపీఎస్ అధికారి సయ్యద్ ముస్తఫా హుస్సేన్ మీర్జాలపై నారద కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది.
నిందితుల్లో పది మంది.. కకోలి ఘోష్ దస్తిదార్, అపరూప పొద్దార్, సువెందు అధికారి, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, ఇక్బల్ అహ్మద్(సుల్తాన్ అహ్మద్ సోదరుడు), సోవన్ ఛటర్జీలకు సమన్లు జారీ చేయబట్టాయి. కోల్కతా సీబీఐ ఆఫీసులో వారిని ప్రశ్నించి, వారి వాయిస్ శాంపిల్స్(గొంతు నమూనాలు) తీసుకోవడం జరుగుతుందని సీబీఐ వర్గాలు తెలిపాయి.
తనకు ఫోన్ వచ్చిందని, తన లాయర్ ను సంప్రదించిన తర్వాత సీబీఐ కార్యాలయానికి వెళతానని అపురూప పొద్దార్ తెలిపారు. కాగా, ముకుల్ రాయ్, టీఎంసీ ఎంపీ కేడీ సింగ్ లను ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ అధికారులు బుధవారం ప్రశ్నించారు. ఈ కేసులో నేరం రుజువైతే ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.