అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్ : మాజీ కాగ్,నలుగురు ఐఏఎఫ్ల విచారణకు అనుమతి కోరిన సీబీఐ
అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వాలని సీబీఐ కేంద్రాన్ని కోరింది. అలాగే మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్,మరో ముగ్గురు ఐఏఎఫ్ అధికారులను విచారించేందుకు అనుమతినివ్వాలని కోరింది. రూ.3727కోట్ల అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో మాజీ కాగ్ పేరు వినిపించడం ఇదే తొలిసారి.
Recommended Video
ఆరోపణలను ఖండించిన శశికాంత్ శర్మ...
అగస్టా వెస్ట్ల్యాండ్ డీల్ సమయంలో శశికాంత్ శర్మ ఎయిర్ఫోర్స్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత 2011 నుంచి 2013 వరకు ఆయన రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆపై 2017 వరకూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG)గా పనిచేశారు. తాజా పరిణామాలపై శశికాంత్ శర్మ మాట్లాడుతూ... 'నా 40ఏళ్ల సర్వీసులో నాపై ఎలాంటి మచ్చ లేదు. నా నిర్ణయాల పట్ల గానీ నా వ్యవహార శైలిపై గానీ ఏనాడు ఎవరూ నన్ను నిందించలేదు. అలాంటి నాపై ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.' అని చెప్పారు.
ఎవరా నలుగురు ఐఏఎఫ్...
2010 ఫిబ్రవరిలో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కోలుగోలుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంగ్లో-ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్ల్యాండ్తో డీల్ కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్,మరో ముగ్గురు ఐఏఎఫ్ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీబీఐ అధికారి తెలిపారు. ఆ ముగ్గురిలో డిప్యూటీ చీఫ్ టెస్ట్ పైలట్ ఎస్ఏ కుంటే,వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ,గ్రూప్ కెప్టెన్ ఎన్ సంతోష్ ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే రిటైర్ అయ్యారు.
ముడుపుల ఆరోపణలు..
అగస్టావెస్ట్ల్యాండ్ డీల్లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించిన మైఖెల్ భారీగా ముడుపులు అందించాడన్న ఆరోపణలున్నాయి. 2008లో లండన్లో దీనికి సంబంధించిన ఒక నోట్ బయటపడింది. అందులో ముడుపులు అందుకున్నవారి వివరాలను పేర్కొన్నారు. దాని ఆధారంగా ఈ కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ను 2017 సెప్టెంబర్లో దాఖలు చేసింది. 2018లో మైఖెల్ను భారత్కు రప్పించగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు.