కేబినెట్ ఫైల్స్ తీసుకెళ్లారు: కేజ్రీవాల్, ఖండన
న్యూఢిల్లీ: సిబిఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్కు సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలు సిబిఐ కొట్టి పారేసింది.
డిడిసిఏ ఫైళ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను సిబిఐ సీజ్ చేసిందని చెప్పారు. సిబిఐ తమకు అవసరం లేనటువంటి పైళ్లను ఎందుకు స్వాధీనం చేసుకుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
డిడిసిఏ పైన దర్యాఫ్తుకు జైట్లీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇందులో జైట్లీ పాత్ర ఏమిటన్నారు. ఏఏపీ నేతలు మాట్లాడుతూ... సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి బానిసలా తయారయిందని ఆరోపించారు.
కాగా, మంగళవారం నాడు కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయం, నివాసంతో పాటు సిబిఐ పలుచోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడి పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేంద్రం పైన మండిపడుతోన్న విషయం తెలిసిందే. తన కార్యాలయంపై సిబిఐ దాడి చేసిందని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ కార్యాలయం పైన కాదని సిబిఐ తెలిపింది.