CBI Shock: మాజీ మంత్రికి మసాల దోసె తినిపించిన సీబీఐ, రూ. వేల కోట్ల స్కామ్, ఎటూకాకుండాపోయాడు, పాపం !
బెంగళూరు/ న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు సీబీఐ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మాజీ మంత్రి రోషన్ బేగ్ కు మసాలా దోసె తినిపించి అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపించిన సీబీఐ సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీఖాన్ తాను మాజీ మంత్రి రోషన్ బేగ్ కు రూ. 400 కోట్లు ఇచ్చానని, డబ్బులు తిరిగి ఇవ్వమంటే రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని రోషన్ బేగ్ మీద ఆరోపణలు చేశాడు .ఇదే కేసులో గత ఏడాది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోసన్ బేగ్ కు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. బెంగళూరులో రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు.
Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!
కాలింగ్ బెల్ వేసిన సీబీఐ
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బెంగళూరు శివాజీనగర మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సీబీఐ అధికారులు సోమవారం ఉదయం బెంగళూరులోని కోల్స్ పార్క్ సమీపంలోని రోషన్ బేగ్ ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ వేశారు.
మాజీ మంత్రి భార్యకు సమాచారం
కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ భార్యకు మీ ఇంటిలో సోదాలు చెయ్యాలని సమాచారం ఇచ్చిన తారువాత సీబీఐ అధికారులు ఆయన ఇంటిలో సోదాలు చేస్తున్నారు. ఐఎంఏ చీటింగ్ కేసు ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీఖాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే సీబీఐ అధికారులు కొన్నిసాక్షాలు సేకరించారు. మన్సూర్ ఇచ్చిన సమాచారం మేరకే రోషన్ బేగ్ ఇంటిలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.
రోషన్ బేగ్ కు సీబీఐ సినిమా
ఆదివారం బెంగళూరులో రోషన్ బేగ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కోరమంగలలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు రోషన్ బేగ్ ను హాజరుపరిచారు. రోషన్ బేగ్ ను 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో అయన్ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. ఇదే జైల్లో ఐఎంఏ స్కామ్ ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు.
దుబాయ్ లో వీడియో విడుదల
ఐఎంఏ వ్యవస్థాపకుడు బెంగళూరుతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు కుచ్చుటోపి పెట్టి 2019లో దుబాయ్ పారిపోయాడు. 2019 జూన్ 6వ తేదీన మన్సూర్ ఆలీఖాన్ దుబాయ్ నుంచి అప్పటి బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు ఓ వీడియో పంపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పిస్తే భారత్ వచ్చి లొంగిపోతానని మన్సూర్ ఆలీఖాన్ మనవి చేశాడు.
రూ. 400 తీసుకుని చంపేస్తానన్నాడు
కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు సిటీలోని శివాజీనగర మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు తాను రూ. 400 కోట్లు ఇచ్చానని, తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మనవి చేస్తే ఆయన రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని అప్పట్లో మన్సూర్ ఆలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్సూర్ ఆలీఖాన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసు విచారణ జరిగింది.
రోషంతో ఎటూకాకుండా పోయిన రోషన్ బేగ్
కర్ణాటకలో అప్పటి కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఐఎంఏ స్కామ్ కేసు విచారణకు ప్రత్యేకంగా ఎస్ఐటీని నియమించింది. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐఎంఏ కేసును సీబీఐకి అప్పగించారు. కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోషన్ బేగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే బీజేపీలో చేరడానికి విఫలయత్నం చేశాడు. అయితే ఐఎంఏ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ ను బీజేపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో బీజేపీ పెద్దలు వెనకడుగు వేశారు. ఇదే సమయంలో రోషన్ బేగ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ బహిష్కరించడం, బీజేపీ ఆదుకోకపోవడంతో రోషన్ బేగ్ ఎటూకాకుండా పోయాడు.