మంగళవారం భారత్ కు ఛోటా రాజన్!
బాలి: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను భారత్ తీసుకురావడానికి సర్వం సిద్దం అయ్యింది. అతనిని భారత్ తీసుకు వెళ్లడానికి ఇండోనేషియా క్రైం బ్రాంచ్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇప్పటికే భారత్ సీబీఐ అధికారులు ఇండోనేషియాలోని బాలి చేరుకున్నారు.
సీబీఐ, ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు బాలి చేరుకున్నారు. బాలిలోని జైలులో ఛోటా రాజన్ ను కలుసుకుని వివరాలు తెలుసుకున్నారు. తరువాత భారత్ అధికారులు ఇండోనేషియా అధికారులతో చర్చించి చట్టపరంగా అన్నిలాంఛనాలను పూర్తి చేశారు.
మంగళవారం ఛోటా రాజన్ ను భారత్ తీసుకు వచ్చే అవకాశం ఉంది. మొదట ఛోటా రాజన్ ను ఢిల్లీ తీసుకు వచ్చి అక్కడే విచారణ చేస్తారని సమాచారం. తరువాత అధికారులు చర్చించి రాజన్ ను ఎక్కడ సురక్షితంగా పెట్టాలనే నిర్ణయం తీసుకోనున్నారు.
ముంబై నగరంలో ఛోటా రాజన్ మీద సుమారు 70 క్రిమినెల్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 30 హత్య కేసులు, డ్రగ్స్ సరఫరా, బలవంతపు వసూళ్లు తదితర కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ ఎట్టకేలకు భారత్ లో అడుగు పెట్టనున్నాడు.
ఇంటర్ పోల్ సహాయంతో ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఛోటా రాజన్ భారత్ వచ్చిన తరువాత ఎవరెవరి పేర్లు బయటకు చెబుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.