126 కోట్ల భూ కుంభకోణం.. రంగంలోకి సీబీఐ.. సర్కార్ ఆదేశాలతో విచారణ
యమునా ఎక్స్ప్రెస్ వే కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తును చేపట్టేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో సీఈవో పీసీ గుప్తా, మరో 19 మందిపై కేసు నమోదు చేసింది. 126 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. యమున ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ కోరకు మథురలో పెద్ద ఎత్తున్న జరిపిన భూ కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం తెలిసిందే.
యమున ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అథారిటి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రాథమిక విచారణ నిర్వహించింది. ఈ కుంభకోణంలో గుప్తా, ఇతర ఉద్యోగులకు సంబంధం ఉందనే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించింది.
యమునా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ కోసం 19 కంపెనీల సహాయంతో మథురలో రూ.85.49 కోట్ల విలువైన 57.15 ఎకరాల భూములను సుమారు గ్రామాల్లో కొనుగోలు చేశారు. అయితే ఈ భూమిని వాస్తవ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల యమునా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు రూ.126 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దాంతో ఈ కుంభకోణంలో వాస్తవాలను బయటకు తీసుకురావడానికి యూపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.
భూ కొనుగోలు వ్యవహారంలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులు ఉన్నారు. వారందర్ని సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతున్నది. అంతేకాకుండా మరికొన్ని డొల్ల కంపెనీలను కూడా సీబీఐ విచారిస్తుంది. ఈ కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు అక్రమ మార్గాల గుండా దళాలరుల చేతిలోకి వెళ్లిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, దళారులను విచారించడమే కాకుండా వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.