సీబీఐ వర్సెస్ సీబీఐ: కమిటీ నుంచి తప్పుకున్న అలోక్ వర్మ, సిక్రీ పేరు ప్రతిపాదన
న్యూఢిల్లీ: అలోక్ వర్మను తిరిగి విధుల్లో చేరాలని, ఆయనను సెలవుపై పంపడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో సీజే రంజన్ గొగొయ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైలెవల్ కమిటీ నుంచి గొగొయ్ తప్పుకున్నారు. తన స్థానంలో జస్టిస్ సిక్రీని ప్రతిపాదించారు.
సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ విషయంలో నిర్ణయం తీసుకోనున్న అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న గొగొయ్ తప్పుకొని, సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి సిక్రీని ముందుకు తీసుకు వచ్చారు.
ఆలోక్ వ్యవహారంలో నిర్ణయం తీసుకునేందుకు కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో లోకసభలో ప్రతిపక్ష నేత, సీజేఐ లేదా ఆయన నామినీ సభ్యులుగా ఉంటారు. ఆలోక్ విషయంలో ఈ కమిటీ వారం లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. దీంతో మోడీ, కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన కమిటీ ఆలోక్పై చర్యల విషయంలో నిర్ణయం తీసుకోనుంది.
కాగా, సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాల మధ్య వివాదాలు ఇటీవల రచ్చకెక్కిన విషయం తెలిసిందే. కేంద్రం ఇద్దరినీ మూడు నెలల క్రితం సెలవులపై పంపించింది. తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని అలోక్ వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆలోక్ను బలవంతంగా సెలవుపై పంపడం కుదరదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ డైరెక్టర్ తాత్కాలిక సస్పెన్షన్ లేదా తొలగింపునకు సంబంధించి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. అలాంటి నిర్ణయాలను ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ అనుమతితో మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.