సీబీఐలో ఫైట్: రాగానే తెలుగు అధికారి నాగేశ్వరరావు పవర్, సొంత కార్యాలయంలో సోదాలు, సీజ్
న్యూఢిల్లీ: సీబీఐ వ్యవహారాల్లో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఇంచార్జి డైరెక్టర్గా ఎం నాగేశ్వర రావును నియమించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాత్రికి రాత్రే ఆయనను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటలకు మన్నెం నాగేశ్వర రావు బాధ్యతలు చేపట్టారు.
రాత్రికి రాత్రే తెలుగు అధికారి నాగేశ్వర రావు నియామకం
అర్ధరాత్రి మోడీ అధ్యక్షతన నియామకాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. అనంతరం ఇంచార్జ్ డైరెక్టర్గా తెలుగు అధికారి నాగేశ్వర రావును నియమించారు. ప్రస్తుతం నాగేశ్వర రావు జాయింట్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపించింది. మరికొందరు అధికారులపై వేటు వేసే అవకాశముంది.
రోడ్డునపడ్డ సిబిఐ పరువు...తమ ఆఫీసులోనే సోదాలు:అందరి అవినీతి బైటపెట్టాల్సిన తానే...!
సీబీఐ కార్యాలయంలో సోదాలు
నాగేశ్వర రావు బాధ్యతలు చేపట్టగానే రంగంలోకి దిగారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని 10వ, 11వ ఫ్లోర్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆస్థానా, దేవేందర్, మరికొందరు అధికారుల చాంబర్లలో సోదాలు నిర్వహించారు. కీలక అధికారుల చాంబర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఛాంబర్లలో అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానావి కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
వెంటనే నాగేశ్వర రావు బాధ్యతలు
1986 బ్యాచ్కు చెందిన నాగేశ్వర రావు ఒడిశా కేడర్లో విధులు నిర్వర్తించారు. ఒడిశా డీజీపీగా కూడా పని చేశారు. నాగేశ్వర రావు స్వస్థలం వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్ నర్సాపూర్కు చెందినవారు. విజయ రామారావు తర్వాత తెలుగు అధికారికి సీబీఐలో అవకాశం ఇదే. నాగేశ్వర రావు ఏడాదిన్నర క్రితం సీబీఐ జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. డీవోపీటో ఉత్తర్వులతో ఆయన తక్షణమే బాధ్యతలు చేపట్టారు. అంతర్గత పోరుతో అలోక్ వర్మను ప్రధాని మోడీ తప్పించారు.
రాత్రికి రాత్రే పరిణామాలు చకచకా
సీబీఐని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ను మార్చే ఆలోచన లేదని సీబీఐ వర్గాలు మంగళవారమే స్పష్టం చేశాయి. అయితే రాత్రికి రాత్రే చకాచకా పరిణామాలు మారాయి. ఈ నేపథ్యంలో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాను సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. పీఎంవోతో పాటు కేంద్ర అధికారుల వ్యవహారాలు చూసే శాఖ నిర్ణయంతో నాగేశ్వర రావును సీబీఐ నూతన డైరెక్టర్గా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.