సీపీఐ వర్సెస్ సీబీఐ: ఆస్తానా-వర్మ పిల్లుల్లా కొట్టుకున్నారు.. సుప్రీంకు ఏజీ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాఫ్తు సంస్థ (సీబీఐ) పైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవులపై పంపించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.
తనను సెలవపై పంపించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ డైరెక్టర్ ఆధారాల తొలగింపుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల విషయంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, లాయర్లు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు ప్రారంభమయ్యాయి.
అలోక్ వర్మను పంపించడంపై వివరణ
అలోక్ వర్మను ఎందుకు పంపించారనే దానిపై అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. సీబీఐకి చెందిన వీరిద్దరు ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వర్గపోరు కారణంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల సీబీఐ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముందని పేర్కొన్నారు.
నమ్మకం కోల్పోయే పరిస్థితి
ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చిందని అటార్నీ జనరల్ తెలిపారు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రభుత్వం అత్యవసరంగా వాళ్లను సెలవులపై పంపించవలసి వచ్చిందని, ఆ దిశగా నిర్ణయం తీసుకుందని, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాక తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేలిందని చెప్పారు.
పిల్లుల్లా కొట్టుకున్నారు
అలోక్ వర్మ, రాకేష్ అస్తానాల విభేదాలు, వర్గపోరు బహిరంగ చర్చకు దారి తీసిందని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా పిల్లుల మాదిరిగా కొట్టుకున్నారని, తద్వారా సీబీఐని అవహేళన చేశారని చెప్పారు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు.
అధికారాలు మాత్రమే తొలగించాం
అలోక్ వర్మకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం ఆయన అధికారాలను మాత్రమే తొలగించామని ఏజీ వేణుగోపాల్ చెప్పారు. సీబీఐ ఉన్నతాధికారులకు మధ్య జరిగిన పోరును వర్మ బహిర్గతం చేశారనే దానికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయా అని సుప్రీం కోర్టు ఏజీని ప్రశ్నించగా.. ఆయన వార్తా పత్రికల్లో వర్మ గురించి వచ్చిన వార్తలను కోర్టుకు అందించారు.