ఆర్ఎస్ఎస్ను సంతోష పెట్టేందుకు సీబీఐ కేసులు: మారన్
చెన్నై: 2జీ స్పెక్ట్రం కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు.
బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్ తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దయానిధి మారన్ వద్ద గతంలో కార్యదర్శిగా పనిచేసిన గౌతమన్తో పాటు సన్ టీవి నెట్ వర్క్కి చెందిన కణ్ణన్, రవి అవే మరో ఇద్దరిని సీబీఐ బుధవారం రాత్రి అరెస్టు చేసింది.
మారన్ తన నివాసానికి, అక్కడి నుంచి తన సోదరుడి టీవీ ఛానెల్కు అక్రమంగా 300 హై స్పీడ్ టెలిఫోన్ లైన్స్ వేయించారన్న ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించనందునే వారిని అరెస్టు చేశారని అన్నారు. ఏడాదిన్నర నుంచి విచారణకు సహకరిస్తున్నా అరెస్టు చేయాల్సిన పని ఏముచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనిలో భాగంగా ఆయన గురువారం పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్' కావాల్సిన సీబీఐ 'ఫిక్సింగ్ మిషన్'గా మారిందని అన్నారు. దేశంలో మానవహక్కులను హరించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. దీనిపై సీబీఐ డైరెక్టర్ తో పాటు, ఎన్ హెచ్ఆర్సీ( జాతీయ మానవ హక్కుల సంఘం) కి లేఖలు రాయనున్నట్లు మారన్ తెలిపారు.