సీబీఎస్ఈ పరీక్షలు 2021 ఫిబ్రవరిలో ఉండకపోవచ్చు: తేదీలు త్వరలోనే, సిలబస్ తగ్గింపు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రమేష్ పోఖ్రియాల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సీబీఎస్ఈ 10,12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదని అన్నారు. కొంత కాలం తర్వాత పరీక్షల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. పరీక్షల నిర్వహణపై త్వరలోనే ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది.
కరోనా మహమ్మారి కారణంగా మార్చి-ఏప్రిల్ మధ్యలో నిర్వహించే పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని కేంద్రమంత్రి తెలిపారు. అయితే, సిలబస్ మాత్రం తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. 30 శాతం సిలబస్ తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.
అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేయాలని విన్నపాలు వచ్చాయని తెలిపారు. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు పరీక్షలను నిర్వహించే అవకాశం లేదని చెప్పారు. అనేక పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నందున పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించే అవకాశం లేదని, ఆఫ్లైన్లోనే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
విద్యార్థులపై కరోనా ప్రభావం పడటానికి తాము అంగీకరించమన్నారు. కరోనా కారణంగా పరీక్షలను తప్పించలేమని అన్నారు. కరోనా కొనసాగుతున్న ఈ ఏడాదిలోనే తాము జేఈఈ, నీట్ లాంటి పరీక్షలను నిర్వహించామని రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. తమ ప్రభుత్వం విద్యార్థుల పక్షానే ఉంటుందని చెప్పారు.