సీబీఎస్ఈ 10th ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
న్యూఢిల్లీః కేంద్రీయ మాధ్యమిక విద్య మండలి (సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం వెల్లడవుతాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడతాయా? అంటూ అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ.. సంబంధిత అధికారుల నుంచి వెలువడిన ఓ ప్రకటన వారిని నిరుత్సాహానికి గురి చేసింది. సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడవుతాయంటూ వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఆ వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు.
ఆదివారం ఫలితాలను వెల్లడించే ఉద్దేశమే లేదని అన్నారు. ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తామనే తేదీని ఇంకా నిర్ధారించలేదంటూ సీబీఎస్ఈ పౌర సంబంధాల అధికారి రామశర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తామనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవడానికి అవసరమైన యాక్సెస్ ను కూడా వెల్లడిస్తామని రామశర్మ తెలిపారు.
ఇదిలావుండగా- ఆదివారం ఉదయం ఫలితాలు వెల్లడవుతాయంటూ మీడియాలో వార్తలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. ఉదయం నుంచే సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ను సందర్శించసాగారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్సైట్ను ఒకేసారి సందర్శించడానికి ప్రయత్నించారు. దీనితో వెబ్సైట్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఎర్రర్ చూపించసాగింది. వెబ్సైట్ సర్వర్ డౌన్ అయినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 16 లక్షల 38 వేల మంది విద్యార్థులు సీబీఎస్ఈ నిర్వహించిన పదో తరగతి పరీక్షలను రాశారు. దీనికోసం అధికారులు 4453 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా- సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ (ప్లస్ టు) ఫలితాలు ఈ నెల 2వ తేదీన వెలువడిన విషయం తెలిసిందే.