సిబిఎస్ఈ ప్రశ్న పత్రాల లీక్: ఆ రెండు పేపర్లకు మళ్లీ పరీక్షలు
న్యూఢిల్లీ: పదో తరగతి లెక్కలు, పన్నెండో తరగతి ఎకనమిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. ఆ సబ్జెక్టులకు సంబంధించిన ఆ రెండు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది.
కొన్ని పరీక్షల నిర్వహణలో జరిగిన సంఘటనలను బోర్డు పరిగణనలోకి తీసుకుని బోర్డు పరీక్షల పవిత్రతను కాపాడేందుకు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
ఆ పరీక్షలు జరిగే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని సిబిఎస్ఈ తెలిపింది. ఓ వారంలో వివరాలను సిబిఎస్ఈ వెబ్సైట్లో పెడుతామని కూడా తెలిపింది. పదో తరగతి లెక్కల పరీక్ష ఈ రోజు జరగగా, పన్నెండో తరగతి ఎకనమక్స్ పరీక్ష సోమవారంనాడు జరిగింది.
పరీక్షకు ఒక రోజు ముందే పన్నెండో తరగతి ఎకనమిక్స్ పరీక్ష ప్రశ్న పత్రం చేతి రాతలో వాట్సప్లో పంపిణీ అయింది. అందులోని చాలా ప్రశ్నలు బోర్డు ఇచ్చిన ప్రశ్న పత్రంలో కనిపించాయి.