సీబీఎస్ఈ కొశ్చన్ పేపర్ లీక్ అయ్యిందా... పోలీసులకు బోర్డు ఫిర్యాదు
12వ తరగతి, 10 వ తరగతి పరీక్ష వేల మరోసారి లీకేజీ భూతం విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే బోర్డు పరీక్షలో 12వ తరగతి అకౌంటెన్సీ, కెమిస్ట్రీ, ఇంగ్లీషు పేపర్లు 10వ తరగతికి సంబంధించి మ్యాథ్స్, సైన్స్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు ఇవి ఒరిజినల్ ప్రశ్నాపత్రాలే అంటూ ఆ వీడియోలో ఉంది.
ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రశ్నాపత్రాలను సీబీఎస్ఈ పరిశీలించిందని అవన్నీ బుటకపు ప్రశ్నా పత్రాలని తేలిందని బోర్డు వివరణ ఇచ్చింది. కేవలం కొందరు పరీక్ష సమయంలో బోర్డుపై బురదజల్లే ప్రయత్నం చేయడంతో పాటు విద్యార్థులను గందరగోళానికి, ఆందోళనకు గురిచేస్తున్నారని సీబీఎస్ఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక వీడియో హల్చల్ చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. కేవలం వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు కొందరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని బోర్డు ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Delhi Police, DCP East: A complaint has been received in Madhu Vihar police station by CBSE to take legal action against persons posting fake videos on internet about leakage of CBSE question papers, which is spreading panic amongst students. pic.twitter.com/WzaGo3vWYa
— ANI (@ANI) March 6, 2019
గతేడాది కూడా సీబీఎస్ఈకి సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే సీబీఎస్ఈ 10వ తరగతి మ్యాథ్స్ పేపర్, 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్ అయినట్లు నిర్థారణకు వచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా సర్క్యులేట్ అవుతున్న బూటకపు వీడియోపై విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తతో ఉండాలని అది వాస్తవం కాదని గ్రహించాలని కోరారు. మరోవైపు గతేడాది ప్రశ్నాపత్రం లీక్ కావడంతో భద్రతను మరింత పెంచారు అధికారులు. ఈ సారి టెట్రా (TETRA) అంటే థియరీ ఇవాల్యుయేషన్ ట్రెండ్ అనాలిసిస్ను ప్రవేశపెట్టనుంది.