మే ఆరున నీట్: మార్చి 9 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు గడువు
న్యూఢిల్లీ: మెడికల్/డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-2018)ను మే నెల 6వతేదీన నిర్వహిస్తామని సీబీఎస్ఈ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ వైద్య/దంత కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో చేరగోరే విద్యార్థులు నీట్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నది. మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
దివ్యాంగులు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును సీబీఎస్ఈ కల్పించింది. పరీక్షను హిందీ, ఇంగ్లిష్తోపాటు తెలుగు, గుజరాతీ, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ భాషల్లో నిర్వహిస్తామని పేర్కొన్నది.
ఎన్నారై, భారత సంతతి విద్యార్థులకు కూడా
నీట్ 2018 అధికార వెబ్సైట్లో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. సీబీఎస్ఈ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఓపెన్ స్కూల్ విద్యార్థులు నీట్ రాయడానికి అనర్హులు. భారత పౌరులు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశాలలో ఉన్న భారతీయులు (ఓసీఐ), విదేశాల్లో ఉన్న భారత సంతతికి చెందిన వారు (పీఐవో), విదేశీయులు నీట్-2018కు అర్హులు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈ - వ్యాలెట్ల ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గరిష్ఠ వయో పరిమితి 25 ఏళ్ల వరకు ఓకే
అభ్యర్థులు ఎంబీబీఎస్/బీడీఎస్ మొదటి సంవత్సరం కోర్సులో చేరే సమయానికి లేదా ఈ ఏడాది డిసెంబర్ 31నాటికి 17 ఏండ్లు నిండినవారై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిని 25 ఏండ్లుగా విధించారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థులకు ఐదేండ్ల సడలింపునిచ్చారు. ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా నీట్ రాయవచ్చని సీబీఎస్ఈ తెలిపింది. ఓసీ, ఓబీసీ విద్యార్థులు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు నింపడంలో జాగరూకతతో వ్యవహరించాలి
అస్సోం, జమ్ముకశ్మీర్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల అభ్యర్థులు ఆధార్ సంఖ్యను దరఖాస్తులో నింపటం తప్పనిసరి. ఈ మూడు రాష్ట్రాల విద్యార్థులు పాస్ పోర్టు నంబర్ గానీ, రేషన్ కార్డు నంబర్ గానీ, బ్యాంక్ ఖాతా నంబర్ గానీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్లో ఉన్న వివరాలతో (పేరు, పుట్టిన తేదీ తదితరాలు) సరిపోకపోతే దరఖాస్తును భర్తీ చేయటం సాధ్యంకాదని సీబీఎస్ఈ పేర్కొంది.
పూర్తి వివరాలకు cbseneet. nic.inను సంప్రదించాలి
తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు 2018-19 విద్యా సంవత్సరం నుంచి తమ ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్ల కేటాయింపులో 15% జాతీయ కోటాను అనుమతించాలని నిర్ణయించినందున ఆ రెండు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు కూడా 15% జాతీయకోటాకు అర్హత పొందుతారని వివరించింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు నీట్-2018 వెబ్సైట్ cbseneet. nic.inలో ఉన్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది.
మార్చి ఐదో తేదీలోగా దరఖాస్తు చేయాలి
మే 26, 27 తేదీల్లో (శని, ఆదివారం) ఎయిమ్స్ ‘ఎంట్రన్స్' ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎయిమ్స్ ఈ నెల ఐదో తేదీనే నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు aiimsexams.org. వెబ్సైట్లో దరఖాస్తు చేయొచ్చు. ఎయిమ్స్ ఢిల్లీతోపాటు పాట్నా, భోపాల్, జోధ్ పూర్, భువనేశ్వర్, రిషికేష్, రాయ్ పూర్, గుంటూరు (ఆంధ్రప్రదేశ్), నాగ్ పూర్ల్లోని ఎయిమ్స్ల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. జూన్ 14న ఎయిమ్స్ ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి ఐదో తేదీ లోగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.