సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల లీకేజి: ప్రధాని మోడీ సీరియస్, జవదేకర్కు ఫోన్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతి ప్రశ్నాపత్రాలు అక్రమంగా విడుదల కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు ఫోన్ చేసినట్టు సమాచారం.
మరోవైపు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో పదోతరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్ఈ బుధవారం నిర్ణయించింది.
సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాలు బయటికి రావడం, తదనంతర పరిణామాలపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోమని ఆయన మంత్రి ప్రకాశ్ జవదేకర్ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. 'ప్రధాని మోడీ ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించేందుకే ప్రాధాన్యమిస్తారు...' అని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలు లీక్ అయిన మాట వాస్తవమేననీ... నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే వారిని ఉపేక్షించేది లేదనీ.. లీకేజ్కి కారణమైన వారిని శిక్షించి తీరతామన్నారు. ఆదివారం సరిగ్గా పరీక్షకు ఒకరోజు ముందు పన్నెండో తరగతి ఎకనామిక్స్ ప్రశ్నాపత్రం వాట్సాప్లో హల్చల్ చేయడం తెలిసిందే.