సిబిఎస్ఈ పేపర్ లీక్: చెలరేగుతున్న దుమారం, విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ: సిబిఎస్ఈ ప్రశ్న పత్రాల లీక్పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టగా, సర్దుకునే తీరులో ప్రభుత్వం వ్యవరిస్తోంది. మరోవైపు అన్ని ప్రశ్న పత్రాలు లీకయ్యాయని, అన్ని పరీక్షలు తిరిగి నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజీనామాకు కాంగ్రెసు డిమాండ్ చేసింది. అలాగే సిబిఎస్ఈ చైర్పర్సన్ను కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
జవదేకర్ రాజీనామాకు డిమాండ్
మంత్రి ప్రకాశ్ జవదేకర్ను, సిబిఎస్ఈ చైర్ పర్సన్ అనిత కార్వాల్ను తొలగించకుండా ప్రశ్న పత్రాల లీకేజీపై విచారణ నిజాయితీగా జరగదని కాంగ్రెసు అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెండు ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మరిన్ని ప్రశ్న పత్రాలు కూడా లీకై ఉంటాయని ఆయన అన్నారు.
అవి రెండు మాత్రమే కావు
వ్యాపమ్, ఎస్ఎస్సి తర్వాత ఇప్పుడు సిబిఎస్ఈకి చెందిన మూడు ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ఆయన అన్నారు. 2017లో 12వ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో కూడా తప్పులు జరిగాయని అన్నారు. సిబిఎస్ఈ చైర్మన్ పదవిని రెండేళ్ల పాటు ఎందుకు ఖాళీగా ఉంచారని ప్రశ్నించారు.
నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ వ్యాఖ్య
ప్రశ్న పత్రాల లీకేజీపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై ద్వజమెత్తారు. చౌకీదార్ వీక్ హై అంటూ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీపై ట్వీట్ చేశారు. #BasEkAurSaal అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇటీవలి కాలంలో డాటా లీక్, ఆధార్ డేటా లీక్, ఎస్ఎస్సి ప్రశ్న పత్రాల లీక్, ఎలక్షన్ డేటా లీక్ వంటి సంఘటనలు జరిగాయని అన్నారు.
విద్యార్థులకు జవదేకర్ హామీ
ప్రశ్నపత్రాల లీక్కు బాధ్యులైనవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆందోళనకు దిగిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మళ్లీ నిర్వహించే పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు విద్యారంగంలో అన్నిరకాల నేరాలను అరికట్టడం పెద్ద సవాల్గా మారిందని అన్నారు.
అలాగే పట్టుకుంటాం...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) ప్రశ్న పత్రాల లీక్ కేసులో నిందితులను పట్టుకున్నట్లే సిబిఎస్ఈ ప్రశ్న పత్రాల లీక్కు పాల్పడినవారిని కూడా పట్టుకుంటామని జవదేకర్ హామీ ఇచ్చారు. అంతర్గత విచారణకు ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపింది. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. దోషులను శిక్షిస్తామని చెప్పారు.
దురదృష్టకరమని జవదేకర్
సిబిఎస్ఈ పదో తరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనమిక్స్ ప్రశ్న పత్రాలు లీక్ కావడం దురదృష్టకరమని మంత్రి జవదేకర్ మీడియా సమావేశంలో అన్నారు. నిందితులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని అన్నారు ఈ సంఘటన వల్ల విద్యార్థులు నష్టపోకూడదని అన్నారు.
నేను కూడా పిల్లలకు తండ్రినే....
తల్లిదండ్రుల బాధ పట్ల తనకు సానుభూతి ఉందని, వారిలో తాను కూడా ఒక్కడినని జవదేకర్ అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆగ్రహాన్ని, వేదనను తాను అర్థం చేసుకోగలనని, తాను కూడా నిద్రపోలేకపోయానని, తాను కూడా పిల్లలకు తండ్రినే అని ఆయన అన్నారు.
సిబిఎస్ఈని సమర్థించిన మంత్రి
మంత్రి జవదేకర్ సిబిఎస్ఈని సమర్థించారు. గతంలో పరీక్షలను నిజాయితీగా నిర్వహించన చరిత్ర సిబిఎస్ఈకి ఉందని, పరీక్షల నిర్వహణకు అది ఉత్తమ విధానమి, ఎస్సి కూడా ఆ విషయాన్ని అంగీకరించిందని చెప్పారు.
దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలు లీక్ కేసు దర్యాప్తునకు ఢిల్లీ నేరపరిశోధక విభాగం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రశ్న పత్రాల లీక్పై ఇచ్చిన ఫిర్యాదులో ఓ ట్యూటర్ పేరును పేర్కొని విచారించారు కూడా. ఇప్పటి వరకు పోలీసులు 25 మందిని ప్రశ్నించారు.