సీబీఎస్ఈ పేపర్ లీక్: టీచర్ సహా మరో ముగ్గురి అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఆర్థిక శాస్త్రం పేపర్ లీకేజ్ కేసులో ఓ ఉపాధ్యాయుడితోపాటు ముగ్గురిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చేతితో రాసిన సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం లీకై వాట్సాప్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ చేతిరాత కాపీ సీబీఎస్ఈ చీఫ్కు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ చేశారు.
ఈ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్లోని డీఏవీ పాఠశాలకు చెందిన ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ రాకేష్, క్లర్క్ అమిత్, ప్యూన్ అశోక్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పరీక్ష ప్రశ్నా పత్రాన్ని వీళ్లు తెల్లపేపర్ల మీద రాసి వాటిని విద్యార్థులకు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఆ ప్రశ్నాపత్రాలను క్లర్క్ ఫొటో తీసి వాట్సాప్లో పెట్టడంతో అవి వైరల్గా మారాయి.
టీచర్ సహా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఢిల్లీకి తరలించారు. ఇటీవల సీబీఎస్ఈ 10వ తరగతి గణితశాస్త్రం, 12వ తరగతి ఆర్థికశాస్త్రం ప్రశ్నాపత్రాలు లీకైనట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. రద్దయిన పన్నెండో తరగతి పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే, పదో తరగతి పరీక్షను మాత్రం మళ్లీ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది.