30% సిలబస్ తగ్గింపు: ఐసీఎస్ఈ బాటలో సీబీఎస్ఈ కూడా, కేంద్రం ప్రకటన..
కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి విద్యార్థులను కూడా పై తరగతులకు పంపిన సంగతి తెలిసిందే. అయితే జూన్ వెళ్లి జూలై నడుస్తోంది. విద్యార్థులకు కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇక విద్యా ప్రమాణాలు అధికంగా ఉండే ఐసీఎస్ఈ సిలబస్ తగ్గించింది. రెగ్యులర్ సిలబస్తో విద్యార్థులకు బోధించలేమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నది.
30 శాతం సిలబస్..
ఐసీఎస్ఈ తర్వాత సీబీఎస్ఈ కూడా అదే బాటలో వెళ్తుంది. 2020-21 ఏడాదికి సిలబస్ తగ్గించింది. 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ మంగళవారం తెలిపింది. 9 నుంచి 12 తరగతి వరకు సీబీఎస్ఈ కరిక్యులమ్ తగ్గించాలని కోరినట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ ఫొఖ్రియాల్ తెలిపారు. దేశంలో, ప్రపంచంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
15 వేల మంది సలహాలు..
సీబీఎస్ఈ సిలబస్ తగ్గించడానికి ముందు తమకు 15 వేల మంది సలహాలు సూచనలు ఇచ్చారని కేంద్రమంత్రి తెలిపారు. విద్యావేత్తలు కూడా సిలబస్ తగ్గించేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సిలబస్ 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన ట్వీట్ చేశారు.
25 శాతం తగ్గింపు..
అంతకుముందు కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ 2021లో 10-12 తరగతి బోర్డు పరీక్షల సిబలబస్ 25 శాతం వరకు తగ్గిస్తామని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో సిలబస్ తగ్గించే నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నది. లాక్ డౌన్ వల్ల సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. జూలైలో నిర్వహిస్తామని బోర్డు స్పష్టంచేసింది. కానీ వైరస్ తీవ్రత దృష్ట్యా.. పరీక్షలను నిర్వహించలేమని భావించి, రద్దు చేసిన సంగతి తెలిసిందే.