వైకల్యాన్ని ఓడించాడు.. 3 సబ్జెక్టుల్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు.. కానీ
నోయిడా : అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. కండరాల వ్యాధి కబలిస్తున్నా మనోధైర్యంతో ముందుకు కదిలాడు. చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. కానీ అది చూసి ఓర్వలేని విధికి కన్ను కుట్టింది. పదో తరగతి పరీక్షలు రాస్తుండగానే ఆ బాలుడిని మృత్యు ఒడికి చేర్చింది. అయితే మరణానికి ముందు రాసిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో వంద మార్కులు తెచ్చుకున్న వినాయక్ శ్రీధర్ చదువుకు వైకల్యం అడ్డుకాదని మరోసారి నిరూపించాడు.
చిన్నబోయిన వైకల్యం
నోయిడాకు చెందిన వినాయక్ శ్రీధర్ రెండేళ్ల వయసులో మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడ్డాడు. కండరాలకు సంబంధించిన ఈ వ్యాధి కారణంగా తనంతట తాను నిల్చోవడం, కనీసం కూర్చోలేకపోయేవాడు. ఏడేళ్లు వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారడంతో వినాయక్ వీల్ ఛైర్కే పరిమితమయ్యాడు. 13ఏళ్లు వచ్చేసరికి తన చేతులతో తాను తినే పరిస్థితి లేకుండా పోయింది. అయినా అతను చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో స్నేహితుల సాయంతో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు
పరీక్షల సమయంలో కన్నుమూత
16ఏళ్ల వినాయక్ నోయిడాలోని అమ్టీ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ క్లాస్ పూర్తిచేశాడు. అయితే ఈఏడాది మార్చిలో జరిగిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో కేవలం మూడు సబ్జెక్టులు మాత్రమే రాయగలిగాడు. ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలోనే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వినాయక్ శ్రీధర్ కన్నుమూశాడు. తాజాగా విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో అతను అద్భుత ప్రతిభ కనబరిచాడు.
3 సబ్జెక్టుల్లో టాప్ స్కోర్
కండరాల బలహీనత కారణంగా వేగంగా రాసే అవకాశం లేకపోవడంతో వినాయక్ స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాశాడు. అతడు హాజరైన మూడు సబ్జెక్టుల్లో టాప్ మార్క్స్ స్కోర్ చేశాడు ఇంగ్లీషులో వందకు వంద మార్కులు రాగా... సైన్స్లో 96, సంస్కృతంలో 97 మార్కులు స్కోర్ చేశాడు. స్కూల్ టాపర్గా నిలవాలని కలలుగన్న వినాయక్ కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాసి ఉంటే వాటిల్లోనూ కచ్చితంగా టాప్ మార్కులు వచ్చి ఉండేవని అతని తల్లిదండ్రులు, టీచర్లు అంటున్నారు.
స్టీఫెన్ హాకింగ్ ఆదర్శం
వైకల్యం వెంటాడుతున్నా వినాయక్ మరణించే వరకు ఏనాడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు. చక్రాల కుర్చీకి పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ను తనకు ఆదర్శమని చెప్పేవారు. అస్టోనాట్ కావాలన్నది అతని కల. ఒక్కసారైనా రామేశ్వరంకు వెళ్లాలని బలమైన కోరిక ఉన్న వినాయక్ పరీక్షలు పూర్తైన తర్వాత అక్కడికి వెళ్లేందుకు ప్లాన్చేసుకున్నాడు. అయితే ఈలోపే లోకం వదిలి వెళ్లిపోయాడు.