9,11 పరీక్షలకు సీబీఎస్ఈ గ్రీన్ సిగ్నల్: ఏప్రిల్ 1 నుంచి తరగతులు ప్రారంభం
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 9, 11వ తరగతులకు సంబంధించి గురువారం కీలక ప్రకటన చేసింది. 9, 11వ తరగతులకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని తన నోటిఫికేషన్లో పేర్కొంది.
అంతేగాక, వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు కూడా ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పాఠశాలలన్నీ తెరుచుకుంటున్నాయి, విద్యార్థులను తరగతులకు స్వాగతం పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. ఈ పరీక్షలు విద్యార్థులు తదుపరి తరగతులకు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారనేది తెలుస్తుందని వెల్లడించింది.
పాఠశాలలు వ్యక్తిగతంగా విద్యార్థులపై దృష్టి పెట్టాలని, అభ్యాస అంతరాలను తగ్గించడానికి ప్రయత్నించాలని బోర్డు సూచించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు దాదాపు ఏడాదిగా తెరుచుకోని విషయం తెలిసిందే.
'2021-22 విద్యా సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు లోబడి సాధ్యమయ్యేంతవరకు ప్రారంభించడం సముచితం" అని సీబీసీఎస్ఈ ఆ నోటీసులో పేర్కొంది.
కాగా, భారతదేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత 24 గంటల్లో 6,99,185 కరోనా నమూనాలను పరీక్షించగా.. 12,923 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 108 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకు చోటు చేసుకున్న మరణాల సంఖ్య 1,55,360కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,42,562 యాక్టివ్ కేసులున్నాయి.