సోషల్ మీడియాకు దూరం.. అందుకే విజయం.. CBSE టాపర్ సక్సెస్ స్టోరీ
ఘజియాబాద్ : స్మార్ట్ఫోన్లు యువతను చిత్తు చేస్తున్నాయి. ప్రపంచాన్ని కుగ్రామం చేస్తూ అరచేతిలో నాట్యమాడుతున్న సెల్ ఫోన్లు జనాలను సిల్లీగా మార్చేస్తున్నాయి. గంటలకొద్దీ సొల్లు పెడుతూ సెల్లే జీవితం అనుకుంటున్నారు కొందరు. ఇక సోషల్ మీడియాలో తామే యాక్టివ్ అనిపించుకునేలా 24 గంటలు అదే ధ్యాసగా చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు మరికొందరు. అయితే సీబీఎస్ఈలో టాపర్ గా నిలిచిన హన్సిక శుక్లా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదని చెబుతున్నారు. అందుకే ఇవాళ సక్సెస్ సాధించానని గర్వంగా ఫీలవుతున్నారు.
త్రినేత్రుడికే ఉంటాయా మూడు కళ్లు?.. నాకు ఉన్నాయి చూడండి..! పాము ఫోటోలు వైరల్
వత్తిడికి గురి కాలేదు.. ఇష్టపడి చదివా..!
గురువారం నాడు విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన హన్సిక శుక్లా టాపర్ గా నిలిచారు. 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే తాను చదువు కోసం ఏనాడు కష్టపడలేదని.. ఇష్టపడి మాత్రమే చదివానని చెబుతున్నారు. జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతం వెల్లడించారు. చదువు విషయంలో ఏనాడు వత్తిడికి గురి కాలేదన్నారు. నేను టాపర్ అని తెలియగానే మొదట నమ్మలేకపోయానని చెప్పుకొచ్చారు. హిస్టరీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, హిందుస్థానీ గాత్రంలో నూటికి నూరు మార్కులు సాధించిన హన్సికకు ఇంగ్లీషులో 99 మార్కులొచ్చాయి.
సోషల్ మీడియాను పక్కన పెట్టా..!
ఫలితాలు వచ్చిన సందర్భాన రాజ్యసభలో సెక్రటరీగా పనిచేసే నాన్న ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి నాకు సమయం లేదు. అమ్మ ఘజియాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే అమ్మ ఇంటికి తిరిగొచ్చాక గానీ రిజల్స్ట్ విషయం నాకు తెలియలేదు.
టాపర్ నువ్వేనంటూ అమ్మ చెప్పినా కూడా మొదట నమ్మబుద్ధి కాలేదు. ఇంకా కూడా నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. అయితే నేను టెన్షన్ పడను.. ఎప్పుడూ కూల్ గా ఉండటమే నాకిష్టం. అదే నా విజయానికి ఒక కారణం కావొచ్చు. ప్రశాంతంగా ఉండటం.. వత్తిడికి గురికాకుండా చూసుకోవడం.. ఈ రెండు కారణాలే నన్ను టాప్ ర్యాంకర్ గా నిలబెట్టాయి. అంతేకాదు నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండను. ఇక పరీక్షలు ప్రారంభమవుతాయనే సమయంలో సామాజిక మాధ్యమాలను మొత్తానికే దూరంగా పెట్టాను. చదువుకునే సమయంలో బోర్ కొడితే పాటలు విన్నానే తప్ప సోషల్ మీడియా జోలికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు.
చదవడమే నా డ్యూటీ.. వేరే పని లేదుగా
ఒక విద్యార్థిగా నా లక్ష్యం నిర్దేశించుకున్నా. ఆ లక్ష్యం ఏదో ర్యాంకులు కొడదామని కాదు. పూర్తిస్థాయిలో చదువు మీద దృష్టి పెట్టడం. ట్యూషన్లకు వెళ్లలేదు.. ప్రతి సబ్జెక్టుపై గ్రిప్ వచ్చేలా విశ్లేషించి చదివా. టాప్ ర్యాంక్ రావడం వెనుక నా ఒక్కదాని కృషి మాత్రమే లేదు.. అమ్మనాన్నలు, స్నేహితులు ఎంతో ప్రోత్సాహం అందించారు. అదే నా బలం, విజయం.
సైకాలజీ నా ఫెవరేట్ సబ్జెక్ట్. బ్యాచిలర్ సైకాలజీలో డిగ్రీ తీసుకుని ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో చేరడమే నా అంతిమ లక్ష్యం. విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేస్తూ వివిధ దేశాల ప్రతినిధులను కలవడం నాకు చాలా ఇష్టమంటూ తన కలల రూపాన్ని ఆవిష్కరించారు.