రెండు ఆప్షన్స్... సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థుల్లో గందరగోళం.. బ్యాక్ బెంచర్స్ హ్యాపీ...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ(HRD) సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అయితే పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన హెచ్ఆర్డీ,సీబీఎస్ఈ... 12వ తరగతి విద్యార్థులకు మాత్రం రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి... ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా ఇచ్చే స్కోర్ను అంగీకరించడం,రెండు.. పరీక్షలకు హాజరవడం. దీంతో విద్యార్థుల్లో దేని వైపు మొగ్గుచూపాలన్న గందరగోళం నెలకొంది. ఈ రెండు ఆప్షన్స్కు సంబంధించి శుక్రవారం(జూన్ 26) మరింత వివరణతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని సుప్రీం సీబీఎస్ఈని ఆదేశించింది.
విద్యార్థులకు రెండు ఆప్షన్స్..
స్కూల్లో నిర్వహించిన చివరి 3 ఇంటర్నల్ టెస్టుల మార్కుల ఆధారంగా 12వ తరగతి విద్యార్థులకు స్కోర్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సీబీఎస్ఈ కోర్టుకు తెలిపింది. అదే సమయంలో పరీక్షలు రాసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నట్టు చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి పరీక్షలు సాధారణ స్థితికి వచ్చాక పరీక్షలు నిర్వహిస్తామని... అప్పుడు విద్యార్థులు పరీక్షలు రాసి స్కోర్ చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని... అలా అయితేనే 12వ తరగతి విద్యార్థులు తమ పరీక్షలు రాసుకోవడానికి.. ఆ స్కోరుతో పై చదువులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.
స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశం...
సీబీఎస్ఈ పరీక్షల అప్డేట్ గురించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు వివరించారు. సీబీఎస్ఈతో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేసినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లను క్వారెంటైన్ కేంద్రాలుగా మార్చినందువల్ల.. పరీక్షల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు.అయితే 12వ తరగతి పరీక్షల విషయంలో రెండు ఆప్షన్స్ ఇవ్వడంపై సుప్రీం సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది. ఇది గందరగోళంగా ఉందని... కాస్త స్పష్టతతో కూడిన నోటిఫికేషన్ అవసరమని చెప్పింది.
సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే పరీక్షలు...
'సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మీరు చెప్పవచ్చు. కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంటుంది. అప్పుడు పరీక్షలపై రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుందా.. లేక కేంద్రమా.. ఇప్పటికే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పేశాయి.' అని సొలిసిటర్ జనరల్కు సుప్రీం బెంచ్ గుర్తుచేసింది. అయితే పరీక్షలపై తదుపరి నిర్ణయం కేంద్రమే తీసుకుంటుందని మెహతా తెలిపారు. అయితే రేపటి లోగా పరీక్షల నిర్వహణపై పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది.
కొందరు హ్యాపీ... కొందరు డైలామాలో...
సీబీఎస్ఈ ఇచ్చిన ఆప్షన్స్ బ్యాక్ బెంచర్స్కి పట్టరాని సంతోషం కలిగిస్తుండగా.. కొంతమంది విద్యార్థులు మాత్రం డైలామాలో పడ్డారు. పరీక్షలు రాసే ఆప్షన్ను ఎంచుకుంటే... అవి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. బయట పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అలాంటప్పుడు పరీక్షలు రాయడం సాధ్యమేనా అని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మెరుగైన స్కోర్ లేకపోతే ఎలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇవేవీ పట్టని బ్యాక్ బెంచర్స్ మాత్రం పరీక్షలు రద్దు అన్న వార్త విన్నప్పటినుంచి సోషల్ మీడియాలో మీమ్స్తో హల్చల్ చేస్తున్నారు.