డైరీ చెప్పిన నిజాలు: ఢిల్లీ సామూహిక ఆత్మహత్యలు ఇలా జరిగాయి
2018, జూన్ 30...శనివారం రాత్రి. దేశం మొత్తం భోజనం చేస్తున్న వేళ...కానీ ఢిల్లీలోని ఓ కుటుంబం మాత్రం ఎలా చనిపోదామనే స్కెచ్ గీసే పనిలో ఉన్నాయి. చనిపోయేందుకు కావాల్సిన సామగ్రిని ఆర్డర్ చేస్తూ... తాము చివరిసారిగా తీసుకోవాల్సిన భోజనం ఆర్డర్ చేస్తూ చాలా బిజీగా గడిపారు కుటుంబ సభ్యులు. సీన్ కట్ చేస్తే జూలై 1వ తేదీ... ఆ కుటుంబంలోని 11 మంది ఉరివేసుకుని సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం లేనట్టుగా అక్కడి సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు 11 ఏళ్లుగా రాసిన 11 డైరీలు చదివితే ఇదే విషయం అర్థమవుతోంది. అయితే తాము చనిపోతామని వారు ఊహించి ఉండరు... అయితే ఏదో పూజాఫలం వల్ల వారు మరింత ఆత్మీయంగా బలపడుతారని భావించి ఉంటారు.
సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే కొన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. చుందావత్ ఇంటి ఎదురుగా కుటుంబానికి చెందిన ఒక మహిళ, ఆమె కుమార్తె, మరో ఇద్దరు పిల్లలు సామూహిత ఆత్మహత్య కోసం వైర్లు, స్టూళ్లు తీసుకెళ్లడం కనిపించింది. లలిత్ చుందావత్ డైరీలో రాసిన క్రమాన్నే కుటుంబ సభ్యులు అంతా పాటించినట్లుగా తెలుస్తోంది. మరణించిన తన తండ్రి ఆవహించినట్లు ప్రవర్తించిన లలిత్ అందరికీ మోక్షం లభిస్తుందని చెప్పాడు. డైరీలో ప్రియాంకా చుందావత్ కూడా ఇదే విషయాన్ని రాసినట్లు తెలుస్తోంది.
"కప్లో కొన్ని నీళ్లు ఉంచండి..రంగు మారేలోగ నేను కాపాడతాను"
ఒకవేళ మృతి చెందితే చనిపోయిన లలిత్ తండ్రి తమను కాపాడతారని ఆ కుటుంబం భావించి ఉండొచ్చు. అయితే డైరీ చివరి వాక్యాలు ఇలా ఉన్నాయి. "కప్లో కొన్ని నీళ్లు ఉంచండి, రంగు మారిన సమయంలో నేను ప్రత్యక్షమై మిమ్మలను కాపాడతాను. పూజలు పూర్తయ్యాక ఒకరి కట్లు ఒకరు విప్పుకోవాలి" అని రాసి ఉంది.
కుటుంబంలోని 12 ఏళ్ల ధృవ, 15 ఏళ్ల శివంలు దగ్గరలోని ఫర్నీచర్ షాపునకు వెళ్లి వైర్లు తీసుకొచ్చారు. అనంతరం వారి చేతులను పిల్లల తల్లిదండ్రులు కట్టేశారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజేలో ఉంది. ఇక సీన్ కట్ చేస్తే జూలై 1న ఉదయం తలుపులు తెరిచి చూడగా మొత్తం 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారు. లలిత్ భార్య టీనా చేతులకు మాత్రం ఎలాంటి కట్లు లేవు. ఎందుకంటే ఆమెనే అందరికి కట్లు కట్టింది. లలిత్ తల్లి నారాయణదేవి కిందనే పడిపోగా మిగతా వారంతా ఉరివేసుకునేందుకు 5 స్టూళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
డైరీలో రాసినట్లుగానే ఫాలో అయ్యారు
తమ కుటుంబంలో చాలా కాలం తర్వాత ప్రియాకు పెళ్లి కుదరడంతో పాటు మరికొన్ని శుభాలు జరగడం వల్ల వారు భగవంతుడికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని భావించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 30న చివరిసారిగా డైరీలో రాశారు. అందులో దేవుని వద్దకు దారి అని రాసి ఉన్నట్లుగా పోలీసులు వివరించారు. గ్రిల్ దగ్గర 9మంది ఉరి వేసుకోవాలని, లలిత్ సోదరి, సోదరుడు భువనేష్లో ఇంట్లో ఉన్న చిన్న మందిరం దగ్గర ఉరివేసుకోవాలని స్పష్టంగా డైరీలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డైరీలో ఏమయితే రాసి ఉందో కుటుంబ సభ్యులు తూచా తప్పకుండా పాటించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
రాత్రి 10 గంటలకు భోజనం ఆర్డర్...ఆ తర్వాత ఒంటిగంటకు ఉరివేసుకోవాలి
ఏ సమయంలో ఏమి చేయాలో అందులో రాసి ఉందని... అలానే రాత్రి 10 గంటల సమయంలో భోజనం ఆర్డర్ ఇవ్వాలని రాసి ఉండటంతో అదే సమయానికి ఆర్డర్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. అందరికి తల్లి నారాయణదేవి భోజనం వడ్డిస్తుందని డైరీలో రాసి ఉంది. ఆ తర్వాత కచ్చితంగా అర్థరాత్రి 1గంటకు ఉరివేసుకోవాలని అందులో రాసి ఉంది. రాసిఉన్నట్లుగానే 11 మంది ఒకేసారి తెల్లారితే జూలై1 అర్థరాత్రి 1గంటకు ఉరివేసుకుని మృతి చెందారు. వారి మొహాలకు, చెవులకు, కళ్లకు డాక్టర్ బ్యాండేజ్తో గట్టిగా పట్టీ వేసుకున్నారు.
విగతజీవులుగా పడిఉన్న కుటుంబ సభ్యులు
జూలై 1న ఉదయం 5గంటల 56 నిమిషాలకు పాల వ్యాన్ వచ్చి వారింటిముందు పాల ప్యాకెట్లు ఉన్న కార్టన్ను ఉంచింది. ఉదయం 7గంటల 14 నిమిషాలకు పక్కింటి వారు వెళ్లి చూడగా అందరూ విగతజీవులై పడి ఉన్నారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోర ఉదంతం వెలుగు చూసింది. ముందుగా హత్యలుగా భావించినప్పటికీ పలు కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు అవి సామూహిక ఆత్మహత్యలే అన్న నిర్ధారణకు వచ్చారు. మూఢనమ్మకాలే వారి ప్రాణాలు తీశాయని సీసీ ఫుటేజీ, దొరికిన డైరీల ఆధారంగా స్పష్టమవుతోందని పోలీసులు తెలిపారు.