కెమెరాకు చిక్కారు: హాస్పిటల్లోకి దూసుకెళ్లిన పోలీసులు..టియర్గ్యాస్ ప్రయోగం
మంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలు చోట్ల భాష్పవాయువును ప్రయోగిస్తున్న విషయం కూడా తెలిసిందే.ఇక మంగళూరులో కూడా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని హైలాండ్ హాస్పిటల్లో నిరసనలు చేపడుతున్న నిరసనకారులను టార్గెట్ చేసే క్రమంలో పోలీసులు హైలాండ్ హాస్పిటల్పై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఇద్దరు ఆందోళనకారులు మృతి
మంగళూరులో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా 9మంది గాయపడ్డారు. వీరందరినీ హాస్పిటల్కు తరలించారు.ఇందులో ఇద్దరు అబ్దుల్ జలీల్, నౌషీన్లను హాస్పిటల్కు తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఒకరి కంటిలోకి బుల్లెట్ దూసుకెళ్లగా మరొకరి వీపులోకి బుల్లెట్ వెళ్లింది. ఇక మరికొందరు బుల్లెట్లు తగిలి గాయపడ్డారు. ఇంకొందరు పోలీసులు చితకబాదటంతో గాయపడ్డారని వైద్యులు తెలిపారు. ఇక చాలామంది గాయపడి హాస్పిటల్లో ఉన్నారన్న వార్త పాకడంతో ఆందోళనకారులు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన యాజమాన్యం
అక్కడ పరిస్థితులను చేయిదాటుతుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది, అయితే పోలీసులు మాత్రం భాష్పవాయువును ప్రయోగించారని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. దీంతో లోపల ఉన్న పేషెంట్లు, ఇతర సిబ్బంది భయపడ్డారని వెల్లడించారు. ఆ తర్వాత ఆందోళనకారుల కోసం పోలీసులు హాస్పిటల్లో సోదాలు నిర్వహించారని చెప్పారు.
హాస్పిటల్లోకి ప్రవేశించి తలపులను కొట్టిన పోలీసులు
గురువారం రోజున సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు కొంతమంది యువత హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కొన్ని నిమిషాల తర్వాత హాస్పిటల్ కాంపౌండ్ నుంచి ఓ వ్యక్తి బయటకు రాళ్లు విసరడం కనిపించాడు. ఆ తర్వాత వెంటనే టియర్ గ్యాస్ షెల్ హాస్పిటల్ ఆవరణలో పడింది. హాస్పిటల్కు రాకముందు ఆ యువకులు ఓ బస్సుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వారిని వెంబడించుకుంటూ పోలీసులు వచ్చారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఇక మరో సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు హాస్పిటల్లోకి ప్రవేశించడం ఆ తర్వాత అక్కడ ఉన్న వారిని కొట్టడం రికార్డ్ అయ్యాయి. అంతేకాదు ఐసీయూ, స్పెషల్ వార్డుల్లోకి కూడా పోలీసులు ప్రవేశించారు. ఆందోళనకారులను వెతికే క్రమంలో వారు హాస్పిటల్లంతా సోదాలు చేశారు.
టియర్గ్యాస్ ప్రయోగంతో ఇబ్బంది పడ్డ పేషెంట్లు
ఇక పోలీసులు హాస్పిటల్లోకి భాష్పవాయువు ప్రయోగించడంతో పేషెంట్లు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు. ఇద్దరిని ఐసీయూలోకి మార్చి వెంటిలేటర్పై ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే హాస్పిటల్ లోపల ఉన్న ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతుండటంతోనే వారు హాస్పిటల్ లోపలికి ప్రవేశించాల్సి వచ్చిందని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని మంగళూరు పోలీస్ కమిషనర్ చెప్పారు.