అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం... సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ఆ ఇన్నోవా కారు...
పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం గురువారం(ఫిబ్రవరి 25) కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వాహనం సీసీటీవీ కెమెరాలో చిక్కింది. థానే-ములుంద్ టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 3.30గం. సమయంలో టోల్ సిబ్బందికి టోల్ చెల్లిస్తున్న సమయంలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
టోల్ ప్లాజా నుంచి థానే వైపు ఆ కారు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. స్కార్పియో వాహనాన్ని ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పార్క్ చేశాక... స్కార్పియో డ్రైవర్ కూడా ఇదే కారులో ఎక్కి పారిపోయాడు. ఆ సమయంలో అతని ముఖానికి మాస్క్ ఉండటంతో అతన్ని గుర్తుపట్టడం కష్టంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం... ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియోని పెట్టేందుకు మరో ఇన్నోవా వాహనం కూడా వచ్చింది. ముకేశ్ ఇంటికి 400మీ. దూరంలో స్కార్పియోని పార్క్ చేశాక... అందులో వచ్చిన డ్రైవర్ ఇన్నోవాలోకి మారిపోయాడు. అప్పటికే సిద్దంగా ఉన్న ఇన్నోవా డ్రైవర్ కారును అక్కడి నుంచి ముందుకు కదిలించాడు. నిందితులు వాడిన ఆ స్కార్పియో కారు చోరీ చేసినదిగా పోలీసులు గుర్తించారు. దాని అసలు యజమానిని ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ఇన్నోవా వాహనం కోసం గాలిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందిస్తూ.. తక్షణం స్పందించి చర్యలు తీసుకున్న ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే పోలీసులు ఈ కేసును లోతుగా విచారించి నిందితులను పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. స్కార్పియో వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్తో పాటు ఒక లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం ఝలక్ మాత్రమేనని నిందితులు అందులో పేర్కొన్నారు.అంతేకాదు,భవిష్యత్తులో అంబానీ నివాసం అంటిల్లాపై దాడి చేస్తామని హెచ్చరించారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటే అంటిల్లా వద్ద ఇప్పుడు సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు.