మిలటరీలో రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్..అందుకేనా..?
న్యూఢిల్లీ: ఖజానాపై పెన్షన్ వ్యయం భారం పడకుండా చర్యలకు దిగారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఇందులో భాగంగా త్రివిధ దళాల చీఫ్స్తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం.
కొంతమంది అధికారుల పదవీ విరమణ వయస్సును క్రమంగా పెంచడం, కంటోన్మెంట్లలో సైనిక గృహాల కోసం అంతర్గత వనరులను ఉత్పత్తి చేయడం మరియు హార్డ్వేర్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై బిపిన్ రావత్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 2010లో రూ.41వేల కోట్లు రూపాయలు ఉన్న పెన్షన్ బడ్జెట్ 2020-21 నాటికి క్రమంగా పెరుగుతూరూ.1.33 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఇది 0.5శాతంగా ఉంది. ఇక వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం కింద ఏటా జూన్లో రూ.6వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లు భారం పడుతున్నట్లుగా సమాచారం.
ఇక ఇలాంటి భారాన్ని అధిగమించి వీలైనంత వరకు తక్కువ చేసే భాగంలో పదవీవిరమణ వయస్సును పెంచితేనే బాగుంటుందన్న ఆలోచనకు బిపిన్ రావత్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదవీవిరమణ వయస్సు 39 ఏళ్లు ఉండగా.. దాన్ని 58 ఏళ్లు చేయాలనే యోచనలో రావత్ ఉన్నట్లు తెలుస్తోంది. 2019-20కి పెన్షన్ బిల్లు రూ.1.13 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే కొత్త నిర్ణయంతో నాన్-కాంబాటెంట్స్ అయిన 4లక్షల మంది సర్వీసును మరింత కాలం పొడిగించి తద్వారా రూ.4వేల కోట్లు ఆదాచేయాలనే యోచనలో ఉన్నారు.
ఇక మిలటరీ హౌజింగ్ సెక్టార్లో త్రివిధ దళాలు వారుకున్న వనరులను వినియోగించుకుని గృహాలను నిర్మించుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు జనరల్ బిపిన్ రావత్. ఇక కంటోన్మెంట్ భూములను తీసుకున్న నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాటికి పరిహారంగా మిలిటరీ హౌజింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. ఇక రానున్న ఏడు ఎనిమేదేళ్లలో రూ.35000 కోట్లు ఆదా చేయాలన్న మిలటరీ ఆలోచనకు డిఫెన్స్ శాఖ మద్దతు తెలుపుతోంది. కొండలపై సైనికులు ఉండే రోజులు పోయాయని వారు కూడా ఇప్పుడు ఫ్లాట్స్లో ఉండే రోజులు వచ్చాయని ఓ సీనియర్ జనలర్ వ్యాఖ్యానించారు.